తనకు, తన సోదరుడు వైఎస్ జగన్ కు మధ్య లేఖలను తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేసిన నేపధ్యంలో వాటిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. చట్ట విరుద్ధమని తెలిసినా.. జగన్ గారు చెల్లెలి మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధం అన్నారు. ఆయన బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ ఆమె ఎద్దేవా చేసారు. ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మర్చిపోయారన్నారు. అందుకే ఇప్పుడు మీకు సమాధానం చెప్పవలసి వస్తుంది అంటూ ఆమె మీడియా సమావేశాలు కీలక వ్యాఖ్యలు చేసారు.
Also Read: మంత్రులూ ఎందుకీ మౌనం..? చంద్రబాబు ఆవేదన..!
నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారు. అది చాలదన్నట్లు ఇప్పుడు కోర్టుల వరకు తీసుకెళ్లారన్నారు. ఆస్తులను లాక్కోవటానికి, ఈడీ కేసులని, బెయిల్ క్యాన్సిల్ అవుతుందని కారణాలు చెబుతున్నారని… కానీ అవేవీ వాస్తవం కాదన్నారు. సరస్వతి కంపెనీ షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేయలేదు. అది కేవలం రూ. 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే ఎటాచ్ చేసింది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కంపెనీ షేర్లను ఎప్పుడూ ఎటాచ్ చేయలేదన్నారు.
Also Read: ప్రకాశంలో జిల్లాలో రాజకీయ కుదుపు…!
ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చు అన్నారు షర్మిల. ఏ కంపెనీ ఆస్తులనైనా ఈడీ ఎటాచ్ చేసినా, ఆ కంపెనీ షేర్ల బదిలీని మాత్రం ఎప్పుడూ ఆపలేదన్నారు. స్టాక్ మార్కెట్లలో ఉన్న చాలా కంపెనీలు కూడా వాటి ఆస్తులను ఈడీ ఎటాచ్ చేసినవి ఉన్నాయని తెలిపారు. అయినా వాటి ట్రేడింగ్ అవుతోంది, షేర్లు బదిలీ కూడా అవుతున్నాయన్నారు. 2016లో ఈడీ ఎటాచ్ చేసినందువల్ల షేర్లు బదిలీ చేయకూడదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. చేస్తే బెయిల్ రద్దు అవుతుందని బీద ఏడ్పులు ఏడుస్తున్నారన్ని షర్మిల మండిపడ్డారు.
Also Read: జగన్ కు ఇక బ్యాండ్ బాజా బారాత్ మొదలు…!
అలాంటప్పుడు 2019లో షర్మిలకు 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU పై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. “2021లో క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను రూ.42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ గారికి ఎలా అనుమతి ఇచ్చారు అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా? 2021లో తన, తన భార్య షేర్లపై సంతకం చేసి, వైఎస్ విజయమ్మ గారికి ఫోలియో నంబర్లతో పాటు గిఫ్టుగా గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా? అని నిలదీశారు.
వాస్తవం ఏమిటంటే మొన్న ఎలక్షన్లో చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత, అంటే 2024లో జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేక, భారతి సిమెంట్స్ బ్యానర్ కింద సరస్వతి సిమెంట్ ను నిర్వహించాలనుకుంటున్నారన్నారు. అందుకే ఇప్పుడు ఈడీ ఎటాచ్ మెంట్ అంశాన్ని లేవనెత్తారు. షేర్లను బదిలీ చేయలేమంటూ చెబుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేసారు. అయితే షేర్లను బదిలీ చేయవచ్చు. ఎందుకంటే ఎటాచ్ చేసినది కేవలం కంపెనీకి చెందిన భూమి మాత్రమే తప్ప.. కంపెనీ షేర్లు కాదు అంటూ షర్మిల సంచలన కామెంట్స్ చేసారు.