తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 89.5 శాతం గ్రీన్ కవర్ తిరుమల కొండల్లో ఉందని, గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియం ను ఆధునీకరించి పునః ప్రారంభం చేశామని పేర్కొన్నారు.
Also read : టీడీపీ గేమ్ ప్లాన్.. వైసీపీలో గుబులు..!
శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాధలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజిఎంలో ఏర్పాటు చేశామన్న ఆయన.. భక్తులు అందరికీ అర్ధం అయ్యేలా వివిధ అంశాలను ఏర్పాటు చేశారని తెలిపారు. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. వచ్చే ఐదేళ్ల పాటు ఈ మ్యూజియం నిర్వహణను కూడా ఆ ట్రస్టుకే అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతీ భక్తుడికీ ఎల్ఐసీ తో కలిసి భీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆధార్ బేస్డ్ ఆన్ లైన్ భీమా చేయాలని నిర్ణయించామన్నారు.
ఎవరైనా భక్తులు దురదృష్ట వశాత్తూ ఇక్కడ మృతి చెందితే వారికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించేలా ఈ భీమా వర్తింప చేస్తారన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు1 లో దుర్లభ్ దర్శన్ పేరిట ఓ హీలింగ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేశామని వివరించారు. శ్రీవారి వైభవం, ఆలయ చరిత్రను ఇతర అంశాలను వివరించేలా ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటు అయ్యిందని, సామాన్య భక్తులందరికీ స్వామి వారి వైభవాన్ని అందించేలా ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు.
తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని, రిలయన్స్ ఫౌండేషన్ 25, భారత్ బయోటెక్ సంస్థ 7 ఈవీ బస్సులను విరాళంగా టీటీడీకి ఇచ్చాయని తెలిపారు. మొత్తం 44 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడు తిరుమలలో భక్తుల రాకపోకలకు అందుబాటులో ఉన్నాయన్న సిఎం.. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది మా ఆలోచన అని పేర్కొన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5 వేల దేవాలయాలను నిర్మించాలన్నది ఆలోచన అని తెలిపారు.
Also read : ఏపీ పట్టణాలకు మహర్దశ.. భారీ ప్రాజెక్ట్ లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో ఆనుసంధానమై ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన అని స్పష్టం చేసారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రతీ వాడలోనూ దేవాలయాలను నిర్మించటం ద్వారా ఆధ్యాత్మికతను పెంపోందించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.

