ఉత్తరాంధ్రలో వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇటీవల మజ్జి శీను పార్టీ వీడిన విషయం మరువక ముందే.. శ్రీకాకుళం జిల్లా వైసీపీలోనూ విబేధాలు భగ్గుమన్నాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ పార్టీ తీరుపై, జిల్లా నేతల వ్యవహారశైలిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళంలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉందని, కావాలంటే సర్వే నివేదికలు చూసుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ హైకమాండ్ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.
Also Read : ఏపీలో ఉద్యోగాల జాతర.. మరో గుడ్ న్యూస్..!
ఆమదాలవలసలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన చిరంజీవి నాగ్.. వైసీపీ పెద్దలపై నిప్పులు చెరిగారు. ఈ నెల 12న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సర్వసభ్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నేత అరెస్ట్ను రాజకీయం అని, తమ్మినేని సీతారాం అరెస్ట్ కాకపోవడాన్ని బంధుత్వంతో ముడిపెట్టి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వేదికపైనే జిల్లా పరిశీలకుడు బూడి ముత్యాలనాయుడు, ధర్మాన ప్రసాదరావు వంటి ఉద్దండులు ఉన్నప్పటికీ ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదని నిలదీశారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ తీరుపైనా చిరంజీవి నాగ్ అసంతృప్తి వెళ్లగక్కారు. ఆయన వ్యవహారశైలి సరిగ్గా లేదని, జిల్లాలో పార్టీని నడిపించే పద్ధతి ఇదేనా అని మండిపడ్డారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉండాల్సిన ధర్మాన ప్రసాద్రావు అభద్రతాభావంతో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు బూడి ముత్యాలనాయుడికి శ్రీకాకుళం జిల్లాలో ఏం పనంటూ సూటిగా ప్రశ్నించడం ద్వారా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమైంది. కేవలం కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా అధిష్ఠానానికే చెప్పాలని ఆయన హితవు పలికారు.
Also Read : టీడీపీ గేమ్ ప్లాన్.. వైసీపీలో గుబులు..!
మొత్తానికి, స్థానిక సంస్థల ఎన్నికల వేళ తమ్మినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ తిరుగుబాటు ప్రకటన వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఉత్తరాంధ్రలో ఇప్పటికే పరాజయాలతో డీలా పడిన పార్టీకి, ఈ అంతర్గత కుమ్ములాటలు మరింత నష్టం చేకూర్చేలా ఉన్నాయి.

