మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ, మరోవైపు నీతులు చెప్పడం జగన్కే చెల్లిందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా సక్రమంగా ఇవ్వకుండా, ఏటా ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో ‘జాబ్ లెస్ క్యాలెండర్’ విడుదల చేసి యువతను అయోమయానికి గురిచేశారని ఆరోపించారు. పరిశ్రమలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి నిరుద్యోగ సమస్యను మరింత తీవ్రం చేశారని మండిపడ్డారు.
Also Read : రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్..!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కేవలం 6,000 పోస్టులతో కంటితుడుపు నోటిఫికేషన్ ఇచ్చిందని, అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. కష్టపడి చదివి, సొంత ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను వైసీపీ నాయకులు అసభ్య పదజాలంతో అవమానించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే డీఎస్సీని రద్దు చేస్తామన్న జగన్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, అర్హత సాధించిన యువత జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
Also Read : డీఎస్సీ ఉద్యమం.. టీచర్లు సక్సెస్.. వైసీపీ ఫెయిల్
డీఎస్సీ నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రతిపక్షం 255 కేసులు వేసి ఆలస్యం చేయాలని ప్రయత్నించిందని ఆలపాటి ఆరోపించారు. న్యాయపరమైన చిక్కులను సమర్థవంతంగా అధిగమించి, కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి కేవలం 150 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసిన ఘనత యువనేత నారా లోకేష్, కూటమి ప్రభుత్వానిదేనని కొనియాడారు. స్పోర్ట్స్ కోటాతో పాటు అన్ని రిజర్వేషన్ ప్రక్రియలను సుప్రీంకోర్టు నిర్దేశించిన హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగానే పూర్తి చేశామని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, ఇప్పుడు రికార్డు స్థాయిలో 150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేసి యువతకు భరోసా కల్పించిందని పేర్కొన్నారు.
Also Read : విదేశీ శ్రీవారి భక్తులకు కేంద్రం బంపర్ ఆఫర్..!
జగన్ చేస్తున్నది రాజకీయ పోరాటం కాదని, ఆధారాలు లేని వీధి నాటకాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శించారు. యువతను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ రెండుసార్లు దాఖలు చేసిన పిల్పై కోర్టు ఆధారాలు, అభ్యర్థుల ఫిర్యాదుల గురించి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. నిజంగా ఏదైనా అక్రమం జరిగితే ఆధారాలు చూపాలని, ఒక్క అభ్యర్థి అయినా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా ప్రతిరోజూ ఆరోపణలు చేయడం జగన్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.

ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరై కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు రావాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ సవాల్ విసిరారు. సభకు రాకుండా పారిపోవడం జగన్కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి ప్రతిభ ఆధారంగా 16,347 ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగ యువతను అవమానించినందుకు జగన్ రెండు చేతులెత్తి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా జరిగిన నియామకాలపై ఆధారాలు లేని నిందలు వేయడం, ప్రజలను మరియు నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించడం ఇప్పటికైనా ఆపాలని ఆయన హితవు పలికారు.

