ముంబైలోని Blinkit గోడౌన్పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే ఆదేశాలతో చేపట్టిన ఈ తనిఖీల్లో ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతకు సంబంధించిన పలు లోపాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. గోడౌన్లో బొద్దింకలు ఉన్నట్లు, అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు తనిఖీల్లో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read : రాజకీయాల్లోకి జగన్ వారసురాలు.. డేట్, ప్లేస్ ఫిక్స్..!
ఆహార పదార్థాల నిల్వ విషయంలో తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎఫ్డీఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారులకు సరఫరా చేసే ఆహార పదార్థాలను సురక్షితమైన వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉండగా.. గోడౌన్లో అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నట్లు తనిఖీల్లో తేలినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో నిబంధనల ఉల్లంఘనపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. Blinkit గోడౌన్కు సంబంధించిన లైసెన్సును ఎఫ్డీఏ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారుల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని హెచ్చరించారు.
Also Read : మెడికల్ రంగంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..!
కాగా, మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆకస్మిక తనిఖీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా Blinkit గోడౌన్పై జరిగిన తనిఖీలు, లైసెన్స్ సస్పెన్షన్ కూడా ఆహార భద్రత విషయంలో అధికారులు కఠిన వైఖరిని అవలంబిస్తున్నారనడానికి నిదర్శనంగా నిలిచాయి.

