ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రానికి గుండెకాయ లాంటి శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో తీవ్ర జల సంక్షోభం ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జలాశయాల్లో ఉన్న అరకొర నీటిని కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించాలని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దాదాపు 60 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని కూటమి సర్కార్ స్పష్టం చేసింది.
Also Read : అలా ఎలా ఇచ్చేస్తారు లోకేష్ గారు.. ఇది భావ్యమేనా..?
ప్రస్తుత కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కృష్ణా డెల్టా పరిధిలోని రైతులు ఎవరూ కూడా అత్యధిక నీరు అవసరమయ్యే వరి సాగును ప్రారంభించవద్దని ప్రభుత్వం పబ్లిక్ అడ్వైజరీ జారీ చేసింది. రిజర్వాయర్లలో నీటి లభ్యత లేనప్పుడు వరి సాగు వైపు వెళ్తే, మధ్యలో పంట ఎండిపోయి అటు పెట్టుబడి, ఇటు శ్రమ వృథా అవుతాయని అన్నదాతలను హెచ్చరించింది. అందువల్ల వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని విజ్ఞప్తి చేసింది.
Also Read : దేశంలో విశాఖ టాప్.. కుప్పలుగా ఉద్యోగాలు
రాబోయే రోజుల్లో కురిసే వర్షాలు మరియు రిజర్వాయర్ల ఇన్ఫ్లోను బట్టి ఖరీఫ్ వరి సాగుపై అటవీ, సాగునీటి శాఖలు సమీక్షించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తాయని తెలిపింది. కృష్ణా డెల్టాకు నీటిని అందించి ఆదుకుంటుందనుకున్న పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరందించే పరిస్థితి లేదు. గోదావరి నదిలో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోవడంతో పట్టిసీమలో కేవలం 15 పంపులను మాత్రమే నడుపుతున్నారు. దీనివల్ల పోలవరం కుడి కాలువలో ప్రవాహం 1000 క్యూసెక్కుల కంటే పైగా పడిపోయింది. ఈ కొరత సమయంలో కొందరు కాలువలకు అనధికార పంపులు పెట్టి నీటిని తోడేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్ అయింది. తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

