వాషింగ్టన్ ప్రపంచ వాణిజ్య రంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్తో పాటు కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10 శాతం కొత్త అదనపు టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించింది. వస్తువుల తయారీలో వెట్టిచాకిరీ నిర్మూలనలో విఫలమైనందుకు గానూ ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ అధికారికంగా వెల్లడించారు.
Also Read : జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్ కు రంగం సిద్దం..?
నిజానికి ఈ వెట్టిచాకిరీ అంశంపై జరిపిన దర్యాప్తు ఆధారంగా జూన్ ప్రారంభంలో అమెరికా సుమారు 60 దేశాలపై అదనపు సుంకాలను ప్రతిపాదించింది. ఆ సమయంలో భారత్ సహా 54 దేశాలపై గరిష్టంగా 12.5 శాతం మేర భారీ సుంకం విధించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై అమెరికా అధికారులతో భారత్ జరిపిన సంప్రదింపులు, నిబంధనల సవరణల వల్ల ప్రస్తుతం భారత్పై విధించే సుంకాన్ని 12.5 శాతం నుండి 10 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం కొంత ఊరటనిచ్చింది.
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్ తక్షణమే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బలవంతపు కార్మికులు లేదా వెట్టిచాకిరీ ద్వారా ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని పూర్తిగా నిషేధిస్తూ జూన్ 14న భారత్ తన ‘విదేశీ వాణిజ్య విధానాన్ని’ సవరించింది. భారత్ తీసుకున్న ఈ సానుకూల నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ నోట్ ప్రత్యేకంగా గుర్తించింది. తమ దేశ చట్టాలకు లోబడి నిబంధనలను పాక్షికంగానైనా అమలు చేస్తున్న దేశాల జాబితాలోకి చేర్చడం వల్లే భారత్కు ఈ 2.5 శాతం మేర సుంకం తగ్గింపు లభించింది.
Also Read : దేశంలో విశాఖ టాప్.. కుప్పలుగా ఉద్యోగాలు
ఈ కొత్త సుంకాల విధింపుపై యూఎస్ వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మాట్లాడుతూ.. అమెరికా గత శతాబ్ద కాలంగా వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే ఉత్పత్తులపై కఠినమైన నిషేధాన్ని అమలు చేస్తోందని గుర్తుచేశారు. అమెరికాతో వాణిజ్యం సాగించే భాగస్వామ్య దేశాలు కూడా అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను మరియు మానవ హక్కులను ఖచ్చితంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

