ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.
Also Read : అలా ఎలా ఇచ్చేస్తారు లోకేష్ గారు.. ఇది భావ్యమేనా..?
రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో 100 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే ఎన్నికలు జరగగా, కోర్టు కేసుల కారణంగా 23 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. ఆ కేసులను పరిష్కరించి, అన్ని మున్సిపాలిటీల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. అలాగే వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పట్టణాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వార్డు సభ్యుడి నుంచి మున్సిపాలిటీ వరకు ఎక్కడ ఎన్నిక జరిగినా వైసీపీ అభ్యర్థి తప్పనిసరిగా బరిలో ఉండాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా పార్టీ అభ్యర్థిని నిలబెట్టడంలో విఫలమైతే స౦బ౦ధిత నియోజకవర్గ ఇన్చార్జిపై చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని వైసీపీ భావిస్తుండగా, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కూటమి విజయ పరంపర కొనసాగుతుందని అధికార పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం స్థానిక పోరుగా కాకుండా, 2029 రాజకీయాలకు సెమీఫైనల్గా మారే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read : తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి
ఇదిలా ఉండగా, ఎన్నికల సమీకరణలపై కూటమి పార్టీల్లో ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. సీట్ల పంపకాలకు సంబంధించి మూడు పార్టీల మధ్య సమన్వయంతో నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే, జనసేన వైఖరి ఆసక్తికరంగా మారింది. 2024 ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికల్లో ఉండదని, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తామని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో సీట్ల సర్దుబాటు అంశం కూటమిలో కీలక చర్చగా మారింది.

