వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఆయన కుమారుడు ఆరవ్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపిస్తున్న కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు, తీవ్రమైన ఆరోపణలను పొందుపరిచారు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు, అసలైన నిందితుడిని చట్టం నుంచి తప్పించేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు.
Also Read : తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి
కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నేరానికి కారణమైన తన కుమారుడిని రక్షించేందుకు మాజీ మంత్రి అప్పలరాజు స్వయంగా రంగంలోకి దిగారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితుడికి ఆశ్రయం కల్పించడంతో పాటు, దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అంతేకాకుండా, అసలు నిందితుడైన తన కుమారుడి స్థానంలో వేరే యువకుడిని నిందితుడిగా చూపేందుకు డమ్మీ నిందితుడిని పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు.
సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ ను చట్టం నుంచి తప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాంకేతిక, ప్రాథమిక సాక్ష్యాలు వారిని బుక్ చేశాయి. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందే, ఘటన జరిగిన స్థలానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ లో ఆరవ్ తన వాహనంలో ఇంధనం నింపుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి సిబ్బందితో పాటు, ప్రమాదం తర్వాత నిందితుడిని పరీక్షించిన వైద్యులు కూడా ఆరవ్ ను స్పష్టంగా గుర్తించారని పోలీసులు రిపోర్ట్ లో వెల్లడించారు. ఈ మేరకు బలమైన సీసీటీవీ దృశ్యాలు, ఇతర ఆధారాలు సేకరించినట్లు స్పష్టం చేశారు.
Also Read : ఉద్యమం విస్తరిస్తోంది.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు..!
ఈ కేసును కోర్టు బయటే సెటిల్ చేసుకునేందుకు బాధితుడి కుటుంబంతో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని, విషయాన్ని బయటకు రాకుండా నొక్కేయాలని చూశారని రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాన్ని పొందుపరిచారు. అధికారిక విధులకు ఆటంకం కలిగించడం, నిందితులను దాచడం వంటి సెక్షన్ల కింద అప్పలరాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 11 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

