ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని పొగాకు పాడు చేసింది.. అంటూ సినిమా మొదట్లో వేసే యాడ్ మాదిరిగా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. అంతా బాగుంది అనుకుంటున్న పరిస్థితుల్లో కొన్ని వివాదాస్పద నిర్ణయాలు లేదా ప్రకటనలు ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవలను పీపీపీ.. పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో నిర్వహించాలన్న నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల ఆస్తులకు సంబంధించిన అత్యంత కీలకమైన వ్యవహారాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదని రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సేవల వేగం, పారదర్శకత పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజల్లో మాత్రం ఆస్తుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : వైసీపీ నయా గేమ్ ప్లాన్.. సూపర్ ఫ్లాప్..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ వివాదాస్పద చట్టం చేసింది. అలాగే పాస్బుక్కులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం పెద్ద ఎత్తున విమర్శలకు తెర లేపింది. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరిగింది. ఆ చట్టం వల్ల ప్రజల భూములకు ముప్పు వాటిల్లుతుందని ఆరోపిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ సేవలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు ముందుకు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం మొదటి దశలో జిల్లా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ అధికారిని మినహాయించి మిగిలిన సేవలను ప్రైవేట్
సంస్థ ఉద్యోగులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వరకు ఈ విధానాన్ని విస్తరించే యోచన ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో టైటిల్ డీడ్ తయారీ, పత్రాల పరిశీలన వంటి కీలక అంశాలు ఉంటాయి. ఈ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ఆస్తుల వివరాలు ప్రైవేట్ సంస్థల వద్ద ఉండడం వల్ల గోప్యత, భద్రతకు సంబంధించిన ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి.
ఇంకోవైపు, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిపై కూడా ప్రభావం పడుతుందని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి. లక్ష మందికి పైగా డాక్యుమెంట్ రైటర్లు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు చేపట్టే ముందు ప్రజల ఆందోళనలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. అదే సమయంలో సేవల సామర్థ్యం పెంచడం, అవినీతిని తగ్గించడం, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమైతే, వాటికి అనుగుణంగా భద్రతా ప్రమాణాలు, బాధ్యతాయుత వ్యవస్థపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కాక్రోచ్ దెబ్బకు దిగివచ్చిన కేంద్ర సర్కార్..!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని… దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం – ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రమూ కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాస్ పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పని చేస్తాయన్నారు. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలని.. అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

