భారత్–ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శనతో 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ భారీ స్కోరు నమోదు చేశారు. పవర్ప్లే నుంచి చివరి ఓవర్ల వరకు దూకుడుగా ఆడిన ఇంగ్లండ్ జట్టు, భారత్ ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లు ఎలాంటి ప్రణాళిక లేకుండా మ్యాచ్ కు వచ్చినట్లు అనిపిస్తుంది. ఒకటి, రెండు ఓవర్లు తప్ప ఎప్పుడూ భారత బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల పై ఒత్తిడి తెచ్చినట్లు అనిపించలేదు. ఇక ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
Also Read : ఎల్నినో ఎఫెక్ట్.. రెడ్ లిస్ట్లో రాయలసీమ..!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గిపోయింది. మధ్య ఓవర్లలో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ చేతుల్లోకి వెళ్లింది. ఇన్నింగ్స్ను నిలబెట్టే స్థాయిలో ఎవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఒక్కొక్కరు ఎంత వేగంగా వచ్చారో.. అంతకంటే వేగంగా పెవిలియన్ కి చేరుకున్నారు. ఒక్కరు కూడా పిచ్ పై నిలిచి ఆడే ప్రయత్నం చేయకపోవడం క్రికెట్ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంగ్లాండ్ రెండవ శ్రేణి జట్టు కూడా భారత్ జట్టు పై గెలుస్తుందా అనిపించింది.
Also Read : జనసేనలోకి నలుగురు మాజీలు..!
ఇంగ్లండ్ బౌలర్లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రదర్శించి భారత బ్యాటింగ్ను పూర్తిగా కట్టడి చేశారు. వేగం, వైవిధ్యం, సరైన లైన్-లెంగ్త్తో బంతులు వేస్తూ బ్యాటర్లను నిరంతరం ఒత్తిడిలో ఉంచారు. ఫీల్డింగ్లోనూ చురుకుదనం కనబరిచిన ఇంగ్లండ్, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది. జోష్ టంగ్ 4, ఆర్చర్ 3 వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్ ని కుప్పకూల్చారు. ప్రతి భారత బ్యాటర్ కి పక్కా ప్రణాళికతో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ లోకి వచ్చింది అని అర్ధం అయింది. ప్రతి ఒక్కరికి సరైన స్థానంలో ఫీల్డర్ ని మొహరించి అందుకు అనుగుణంగా బౌలింగ్ చేశారు.
ఈ ఫలితం భారత్కు గట్టి హెచ్చరికగా భావించవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్లో స్థిరత్వం, బౌలింగ్లో ఖచ్చితత్వం పెంచుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపించింది. మరోవైపు, ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి తమ బలాన్ని మరోసారి నిరూపించింది. రాబోయే మ్యాచ్ల్లో ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని భారత్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందనే ఆశ అభిమానుల్లో ఉంది.

