ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో యూట్యూబర్ రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదు కాగా, తాజాగా గన్నవరం పోలీసులు అతనిపై అత్యంత కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నటుడు ప్రకాష్ రాజ్ తో మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.
Also Read : మేడం సైలెన్స్.. కారణాలేమిటీ..?
కేవలం వ్యక్తిగత దూషణలే కాకుండా, రాష్ట్రాన్ని అస్థిరపరిచే పెద్ద కుట్ర కోణంలో నిఘా వర్గాలు, పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిషేధిత నక్సలైట్ భావజాలం, దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఉపా చట్టంలోని సెక్షన్ 39 కింద ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ, సమాజ శాంతికి భంగం కలిగించే చట్టవిరుద్ధ చర్యలకు అది వర్తించదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గత చరిత్రను పరిశీలిస్తే ఉపా చట్టం కింద కేసు నమోదైన నిందితులకు ఇప్పట్లో బెయిల్ రావడం దాదాపు అసాధ్యం.
Also Read : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరు..?
ఈ చట్టం కింద అరెస్ట్ అయిన చాలా మంది ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గుతున్న దాఖలాలు ఉన్నాయి. సాధారణ కేసుల్లో లాగా సులభంగా బెయిల్ దొరకదు కాబట్టి, యూట్యూబర్ రావణ్ న్యాయపోరాటం గెలిచి బయటకు రావడం ప్రస్తుతానికైతే చాలా కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే, కేవలం నాలుగు రోజుల్లోనే రావణ్ ను పోలీసులు ఐదుసార్లు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయనకు కోర్టులు ఒకదాని తర్వాత ఒకటిగా బెయిల్ మంజూరు చేశాయి. అయితే, ఒక కేసులో బెయిల్ వచ్చి జైలు లేదా కోర్టు నుంచి బయటకు రాగానే, వేరే స్టేషన్ పోలీసులు సిద్ధంగా ఉండి మరో పాత కేసులో ఆయనను తిరిగి అదుపులోకి తీసుకుంటూ వచ్చారు.

