బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా ఘనవిజయం సాధించాలంటే దానికి భారీ తారాగణం లేదా కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. బలమైన కథాంశం, అద్భుతమైన సంగీతం, హృదయాలను హత్తుకునే ప్రేమకథ ఉంటే చాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఎలాంటి హంగులు లేకపోయినా ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడతారని అభిప్రాయపడ్డాడు. ఓ ఇంటర్వ్యూలో తన సినిమా గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసాడు ఈ సీనియర్ హీరో.
Also Read : కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ లు..!
ఈ రోజుల్లో పెద్ద పెద్ద మల్టీస్టారర్ యాక్షన్ ఎంటర్టైనర్లు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోగలవనే కొందరి వాదనలను అక్షయ్ కుమార్ తోసిపుచ్చాడు. “సినిమాకు మంచి విజయం దక్కాలని రాసిపెట్టి ఉంటే.. అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఆడుతుంది” అని చెప్పుకొచ్చాడు. అందుకు ఉదాహరణగా సరికొత్త నటీనటులతో వచ్చిన సయ్యారా చిత్రాన్ని అక్షయ్ గుర్తుచేశాడు. ఆ సినిమాలో ఎలాంటి భారీ ఈవెంట్లు లేదా పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా.. కేవలం మంచి పాటలు, లవ్ స్టోరీ మరియు నటీనటుల ప్రతిభ వల్లే ఆ చిత్రం హిందీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రొమాంటిక్ ఫిల్మ్గా నిలిచిందని కొనియాడాడు.
Also Read : ఉక్రెయిన్ వ్యూహం ఏంటీ..? ఊహకు అందని దాడులు..!
ఇక అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ కామెడీ ఎంటర్టైనర్ వెల్కమ్ టు ది జంగిల్ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తన ఓపెనింగ్ వీకెండ్ లోనే ఏకంగా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్, రవీనా టాండన్, లారా దత్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు దిశా పటాని వంటి దాదాపు 30 మందికి పైగా ప్రముఖ నటీనటులు నటించడం విశేషం.

