తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందనే సంకేతాలను పవన్ కల్యాణ్ ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే దీని పై తెలంగాణ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఘాటుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ పై సెటైర్లు వేశారు.
Also Read : అమరావతి రైతులతో జగన్ గేమ్ ప్లాన్ స్టార్ట్..!
ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో, “ఒంటరిగా వస్తున్నావా? పొత్తులతో వస్తున్నావా? క్లారిటీ ఇచ్చి రా” అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల రాజకీయాల్లో జనసేన పాత్ర ఏమిటనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా విస్తృత చర్చకు దారితీసింది. ఇప్పటికే పలు మార్లు పవన్ కళ్యాణ్ పై తన అక్కసుని ప్రకాష్ రాజ్ బయటపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే ఇప్పుడు పవన్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది.
అయితే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకాష్ రాజ్పై విమర్శలు గుప్పించారు. “ఒరే.. నీకెందుకురా.. ప్రతి దాంట్లో వేలు పెడతావు?” అంటూ ప్రారంభమైన ఆయన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రకాష్ రాజ్ తరచూ రాజకీయ అంశాలపై స్పందించడం పట్ల బండ్ల గణేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంకా ఆయన, “నువ్వు తమిళోడివా? తెలుగోడివా? కన్నడోడివా? నీ వూరేది? నీ కథేంటి?” అంటూ ప్రశ్నించారు. ప్రతి అంశంలో జోక్యం చేసుకుని హీరోలా వ్యవహరించవద్దని సూచించారు. “ముందు నీ అడ్రస్ తెలుసుకో.. ఆ తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి” అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : అన్నామలై కొత్త పార్టీ : తమిళనాడులో మరోసారి రాజకీయ వేడి !
ఇలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ప్రారంభమైన రాజకీయ చర్చ, ప్రకాష్ రాజ్ విమర్శలు, బండ్ల గణేష్ కౌంటర్తో మరింత వేడెక్కింది. ఈ పరిణామాలు జనసేన రాజకీయ వ్యూహాలపై కొత్త చర్చకు తెరలేపడంతో పాటు, సినీ ప్రముఖుల మధ్య మరోసారి మాటల యుద్ధానికి కారణమయ్యాయి. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై సంబంధిత నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

