బ్రిటన్ రాజకీయాల్లో వలసదారులను ఉద్దేశించి ఒక బ్రిటిష్ ఎంపీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. యూకేలో స్థిరపడిన లక్షలాది మంది భారతీయులు, పాకిస్తానీయులను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే రిఫార్మ్ యూకే పార్టీ నుండి విడిపోయి, రిస్టోర్ బ్రిటన్ అనే రైట్ వింగ్ రాజకీయ పార్టీని స్థాపించిన స్వతంత్ర ఎంపీ రూపర్ట్ లోవ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలనం..!
ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. బ్రిటన్ లోని నిరుద్యోగులు చేయాల్సిన ఉద్యోగాల కోసం మనం లక్షలాది మంది పాకిస్తానీయులను, భారతీయులను ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాట అనడం వల్ల నన్ను రేసిస్ట్ అని ముద్ర వేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ రాసుకొచ్చారు. రూపర్ట్ లోవ్ అంతటితో ఆగకుండా, బ్రిటన్ రాజకీయ నాయకులు కావాలనే థర్డ్ వరల్డ్ దేశాల నుండి తక్కువ నైపుణ్యం ఉన్న వలసదారులను భారీగా దేశంలోకి రప్పించారని ఆరోపించారు.
Also Read : ట్రెడ్ మిల్ పై వాకింగ్ మంచిదా..? రన్నింగ్ మంచిదా..?
నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్ ప్రాంతాలు ఇప్పుడు బ్రిటన్ లా కాకుండా ఏదో విదేశీ భూభాగంలా కనిపిస్తున్నాయని విమర్శించారు. ముస్లిం జనాభాను టార్గెట్ చేస్తూ బురఖాలను నిషేధించాలని, బ్రిటన్ వీధులు ఇస్లామిక్ గా మారుతున్నాయని, ఇది ఒక రకమైన కబ్జా లేదా వలసవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రిటిష్ వాసులు గతంలో వేరే దేశాలను ఆక్రమించి, అక్కడి సంపదను ఎలా దోచుకున్నారో, అప్పుడు చేసిన దురాగతాల వల్లే ఇప్పుడు ఆయా దేశాల ప్రజలు యూకేకు వలస రావాల్సి వచ్చిందని గతాన్ని గుర్తు చేస్తూ చురకలు అంటిస్తున్నారు.

