ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన కుల రాజకీయాలపై, ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు నాయకుల తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. తాను ఏ ఒక్క కులం కోసమో, వర్గం కోసమో రాజకీయాల్లోకి రాలేదని, దేశం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కాపు యువత కులం అనే సంకెళ్ల నుంచి బయటకు రావాలని, సరికొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Also Read : ట్రెడ్ మిల్ పై వాకింగ్ మంచిదా..? రన్నింగ్ మంచిదా..?
నేటి యువత భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే వారి మెదళ్ళు నుంచి కులం అనే పిచ్చిని తొలగించాల్సిన అవసరం ఉందని పవన్ బలంగా నమ్ముతున్నారు. సమాజంలో మార్పు రావాలంటే యువత కులాల గిరి దాటి, సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించాలని ఆయన కోరుతున్నారు. అంబేద్కర్ ఆశయాల ప్రకారం కుల నిర్మూలన దిశగా అడుగులు పడాలని, జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచనా విధానం వైపు యువత నడవాలని ఆయన ఆకాంక్షించారు.
తనను ఒక నిర్దిష్ట కులానికి పరిమితం చేయాలని చూసే నాయకులకు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నన్ను ఒక కుల నాయకుడిగా మార్చాలని చూడకండి, అంతగా కావాలంటే మీరే సీఎం అభ్యర్థిగా నిలబడి గెలవండి అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలంగా తను ఓపిక పట్టానని, కానీ కేవలం కులం కార్డుతో రాజకీయం చేస్తూ విమర్శలు చేసేవారికి ఇకపై సహించేది లేదని హెచ్చరించారు.
Also Read : సెక్స్ వర్కర్లపై పోలీసు దాడులపై సుప్రీం సంచలన తీర్పు..!
రాబోయే కాపు తరాలకు ఎలాంటి కుల జాడ్యం అంటకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ రకమైన సాహసోపేతమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువత కేవలం ఒక కులానికి అండగా ఉండే ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా, సమాజంలో ఉన్నతమైన మార్పు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేలా వారిని చైతన్యపరచడమే జనసేనాని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

