తమిళనాడు రాజకీయాలు మరోసారి సంచలనంగా మారాయి. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని, డీఎంకే క్యాడర్ అంతా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న స్టాలిన్, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read : నీట్ పరీక్షపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఎన్నికల ఓటమి తాత్కాలికమేనని, శ్రేణులు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వానికి స్పష్టమైన ఒంటరి మెజారిటీ లేదని, ఇతరుల మద్దతుతో నడుస్తున్న ఈ అస్థిర ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడలేదన్నారు. పరిస్థితులు తారుమారైతే 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమిళనాడు అసెంబ్లీకి కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.
Also Read : ఏపీలో ప్రభుత్వ బడులకు ఫుల్ క్రేజ్..!
ఈ ముందస్తు ఎన్నికల ముప్పును దృష్టిలో ఉంచుకుని డీఎంకే శ్రేణులు, నియోజకవర్గ నాయకులు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం కావాలని గట్టిగా ఆదేశించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడుతూ, గతంలో టీ షాపుల్లో జరిగిన రాజకీయాలను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాట్లాడాల్సిన అవసరం ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రచారంలో డీఎంకే మరింత దూకుడు పెంచాలని క్యాడర్ కు దిశా నిర్దేశం చేశారు. అలాగే తాజా ఎన్నికల ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని ప్రకటిస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ బలోపేతం చేసేందుకు 36 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

