నీట్ యూజీ 2026 పేపర్ లీక్పై పార్లమెంటరీ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణల అమలుతో పాటు పేపర్ లీక్ కేసును సమీక్షించాలని పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు చర్చల కోసం నీట్ ఛైర్ పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి సహా ఇతర ఉన్నతాధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్, కేసు దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న కమిటీ, ఈనెల 21న కమిటీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీక్, యూజీ సంస్కరణలపై మే 21న విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత అధికారులు నుంచి అభిప్రాయాలను సేకరించనున్నట్లు రాజ్యసభ ఒక ప్రకటన విడుదల చేసింది.
Also Read : అవును.. వాళ్లిద్దరు కలిశారు.. మరి వీళ్లిద్దరూ..?
యూజీ సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ నివేదిక అమలును సమీక్షించడం, అలాగే నీట్ యూజీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు పురోగతిని తేలుసుకోవడం ఈ సమావేశ అజెండాలో ఉన్నాయి. ఇంకా విద్యారంగంపై కృత్రిమ మేధస్సు ప్రభావం, విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే వ్యూహాలపై కూడా ఈ కమిటీ చర్చించనుంది. ఈ చర్చల కోసం ఆంధ్రోపిక్ ఇండియా, ప్రథమ్, ఐఐటీ కాన్పూర్, ఇన్ఫోసిస్, ఐఐటీ మద్రాస్కు చెందిన ప్రతినిధులు ఉన్నారు. కాగా, ఈ కమిటీకి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మరో ప్రత్యేక సమావేశంలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉపకులపతి, మైనారిటీ విద్యా సంస్థల జాతీయ కమిషన్ చైర్పర్సన్తో కమిటీ చర్చలు జరపనుంది. రిజర్వేషన్ల అమలు, ఖాళీలు, జాతీయ విద్యా విధానం వంటి వివిధ అంశాలపై ఈ చర్చలు సాగనున్నాయి. ఈ కమిటీ తన 379వ నివేదిక పైనా చర్చించనుంది. ఇందులో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన 365వ నివేదికలోని సిఫార్సుల అమలుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నాయి. అంతేకాకుండా, ‘జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి’ పనితీరు సమీక్ష, చీజూ 2020 కింద చేపట్టిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలపై రూపొందించిన 368వ నివేదికలోని సిఫార్సుల అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై రూపొందించిన 380వ నివేదికను కూడా ఈ కమిటీ పరిశీలించనుంది.
Also Read : పాక్ ఉగ్రవాదులకు లైవ్ కవరేజ్.. యూపీలో భారీ కుట్ర..!
మరోవైపు నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరొకరిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని లాతూర్లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ ఫౌండర్ శివరాజ్ రఘునాథ్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ, దానిని ఇతరులకు చేరవేసిన ముఠాలో శివరాజ్ సభ్యుడని దర్యాప్తులో భాగంగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జరిపిన సోదాల్లో భాగంగా అతడి ఫోన్లో లీక్ అయిన ప్రశ్నాపత్రం కనిపించడంతో అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చగా 9 రోజుల కస్టడీ విధించింది. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన పరీక్షను యూజీ రద్దు చేసింది. ఈ క్రమంలోనే నీట్ యూజీ రీ ఎగ్జామ్ను జూన్ 21న నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి ఈ వైద్య ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతుందని చెప్పారు. దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు నమోదు చేసుకున్నారు.

