మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో నీటి కొరత, దుర్భర పరిస్థితులపై ఆంధ్ర న్యూస్ 9 ప్రచురించిన వార్తకు స్పందన వచ్చింది. ఆసుపత్రిలో నీటి కొరత కారణంగా రోగులు, బంధువులు బయట నుంచి బకెట్ల ద్వారా నీళ్లు తెచ్చుకుంటున్నారు. అలాగే నీటి కొరత వల్ల బాత్రూమ్లు అపరిశుభ్రంగా తయారయ్యాయి. నీరు లేక రోగులు, చిన్న పిల్లలు నానా పాట్లు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఆంధ్ర న్యూస్ 9 ఫోటోలతో సహా ప్రచురించింది. నీటి సమస్య తెలుసుకున్న వైసీపీ నేతలు ఆసుపత్రికి ప్రైవేటు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయడం పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వ ఆసుపత్రికి పార్టీ పేరుతో ఉన్న నీటి ట్యాంకర్ రావడంతో “మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!” అనే వార్తను ఆంధ్ర న్యూస్ 9 రెండు రోజుల క్రితం ప్రచురించింది.
Also Read : పోలవరం పనులపై మళ్ళీ తెలంగాణ రచ్చ షురూ..!
“మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!” అంటూ ఆంధ్ర న్యూస్ వార్తపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 8:45 గంటలకే ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, రిజిస్టర్లు, వార్డులు, వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ సమయంలో సుమారు 44 మంది సిబ్బంది విధులకు గైర్హాజరు కావడాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని హెచ్చరించారు. నీటి సమస్యపై తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. తక్షణమే విచారణ జరిపి 24 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
Also Read : మంత్రి అచ్చెన్న పరువు పోయిందిగా..!
ఆసుపత్రిలో నీటి సమస్యను సాకుగా చూపి ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి కానీ, ముందస్తు ప్రణాళికతో పక్క పార్టీ వారు వాటర్ ట్యాంకర్లతో రావడమేంటని” అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఇటువంటి పనులు చేస్తున్నారని, వీటికి సహకరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. చిన్న సమస్యలకు సైతం రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read : బ్రేకింగ్: నాగార్జున యాదవ్ కు మ్యూజిక్ స్టార్ట్..!
తనిఖీలో భాగంగా చిన్నపిల్లల వార్డు, గర్భిణీల విభాగం, డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రి సందర్శించారు. రోగులతో స్వయంగా మాట్లాడి, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా?.. మందులు సక్రమంగా ఇస్తున్నారా?.. అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలను పర్యావరణ హితంగా, పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. ఇందులో ఆపరేషన్ టేబుల్స్ – 4, మల్టీ పారమానిటర్లు – 5, వీన్ ఫైండర్స్ – 2, రోగుల విశ్రాంతి చైర్స్ – 20 అందజేశారు. తక్షణమే ఆయా విభాగాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

