ఏపీ డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే ఆరోపణలతో వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త సైలెంట్ అయిన ఈ నేత.. ఈ మధ్య కాలంలో మళ్ళీ దూకుడు పెంచడం, విమర్శలు చేయడం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన నిధులను డిప్యూటీ సీఎం దారిమళ్లించారంటూ నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి.
Also Read: పోలవరం పనులపై మళ్ళీ తెలంగాణ రచ్చ షురూ..!
ఇటీవల ఒక ప్రకటనలో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ.. కేంద్రం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను పవన్ కల్యాణ్ ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. నాగార్జున యాదవ్ ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన నేత రామ సైదులు సత్తెనపల్లి గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read : మోదీ పొదుపు సలహాల వెనుక అసలు లెక్క ఇదే..!
జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సత్తెనపల్లి పోలీసులు, నాగార్జున యాదవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పెరిగిందని జనసేన నాయకులు వాదిస్తుండగా, వైసీపీ మాత్రం నిధుల మళ్లింపు జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్పై కేసు నమోదు కావడంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది.

