నేషనల్ హైవే-16పై రోడ్ల దుస్థితికి నిరసనగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి, మరమ్మతులు పూర్తి చేసే వరకు వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఆదివారం అర్ధరాత్రి కలపర్రు టోల్ ప్లాజా వద్ద బైఠాయించారు. కలపర్రు నుండి గుండుగొలను వరకు ఉన్న సుమారు 30 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతిన్నది. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
Also Read : పాపం దేవినేని.. మరి ఇలా చేశారేంటి సార్..!
ఈ సమస్యపై గతంలో అనేకసార్లు రహదారి భద్రత సమావేశాల్లో ప్రస్తావించినా, వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో చింతమనేని నేరుగా రంగంలోకి దిగారు. ఆదివారం అర్ధరాత్రి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న ఆయన, మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం డబ్బులు వసూలు చేయడమేనా..? అని అధికారులను నిలదీశారు. రోడ్లు బాగుపడే వరకు టోల్ గేట్లు తెరవాలని పట్టుబట్టడంతో, సుమారు 11 గంటల పాటు వాహనాల నుంచి ఎటువంటి ఫీజు వసూలు చేయలేదు.
Also Read : భారత్ కు ఇరాన్ విదేశాంగ మంత్రి.. కారణం అదేనా..?
ఎమ్మెల్యే నిరసనతో హైవేపై ఉత్కంఠ నెలకొనడంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే మరియు జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని, డివైడర్ల వద్ద లైట్లు మరియు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ స్వయంగా సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే చింతమనేని తన నిరసనను విరమించుకున్నారు. మధ్యాహ్నం నుంచి కలపర్రు టోల్ ప్లాజా వద్ద యథావిధిగా వసూళ్లు ప్రారంభమయ్యాయి. అయితే, అధికారులు తమ హామీని నిలబెట్టుకోకపోతే మళ్ళీ ఆందోళన చేస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.

