ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సాధారణంగా కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగడం, రోజుల తరబడి వేచి చూడటం వంటి కష్టాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఇకపై వాహనం కొన్న 24 గంటల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని రవాణా శాఖకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read : బీజేపీలోకి కొడాలి నాని.. నిజమేనా..?
ఈ నూతన విధానంలో అత్యంత కీలకమైన అంశం ఆటోమేటిక్ అప్రూవల్ సిస్టమ్. సాధారణంగా షోరూమ్ లో వాహనం కొన్న వెంటనే డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తును రవాణా శాఖ అధికారులు ఆన్లైన్ లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, అధికారులు నిర్ణీత 24 గంటల గడువులోగా ఈ దరఖాస్తును క్లియర్ చేయకపోతే, సాఫ్ట్ వేర్ ద్వారా అది ఆటోమేటిక్ గా ఆమోదం పొంది, శాశ్వత నంబర్ జనరేట్ అయిపోతుంది. దీనివల్ల అధికారుల జాప్యంతో సంబంధం లేకుండా వాహనదారులకు నిర్ణీత సమయంలో సేవలు అందుతాయి.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో, వాహన డీలర్లను అదనపు రిజిస్ట్రేషన్ అథారిటీగా గుర్తిస్తూ సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా వాహనం కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 వేల దరఖాస్తులు అధికారుల ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, ఈ జాప్యాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ రిజిస్ట్రేషన్ నంబర్ కోరుకునే వారందరికీ ఈ 24 గంటల నిబంధన వర్తిస్తుంది.
Also Read : హోండా కొత్త SUV.. ఫీచర్లు చూస్తే షాక్..!
ఇక్కడ కొన్ని విషయాలపై అవగాహన అవసరం కానుంది. ఫ్యాన్సీ నంబర్లు కోరుకునే వారికి మాత్రం ప్రస్తుతమున్న వేలం ప్రక్రియ కొనసాగుతుంది. సెలవు దినాల్లో కూడా అధికారులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు ఇచ్చేలా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం వల్ల రవాణా శాఖలో అవినీతికి అడ్డుకట్ట పడటమే కాకుండా, పౌర సేవల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ విధానం పట్ల వాహనదారులు, డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

