కొడాలి వెంకటేశ్వరరావు అంటే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ.. కొడాలి నాని అంటే మాత్రం ఠక్కున గుర్తుకు వస్తారు. 2004 నుంచి 2024 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, హరికృష్ణ, తారక్తో ఉన్న అనుబంధం అడ్డుపెట్టుకుని.. ఎమ్మెల్యేగా గెలిచిన నాని.. ఆ తర్వాత జగన్ పంచన చేరారు. ఇక అప్పటి నుంచి చంద్రబాబు పైన, లోకేష్ పైన.. చివరికి బాలకృష్ణ పై కూడా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. కొడాలి నాని అంటే బూతుల మంత్రి అనే పేరు తెచ్చుకున్నారు కూడా. వైసీపీ ఓటమికి నాని పరోక్ష కారణమనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. చంద్రబాబుపై పదే పదే వ్యక్తిగత విమర్శలు చేయడం.. ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకతకు కారణమైందనేది బహిరంగ రహస్యం.
Also Read : మాజీ ఐఏఎస్లు ఏమనుకుంటున్నారంటే..?
2024 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే కౌంటింగ్ సెంటర్ నుంచి కొడాలి నాని వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన సైలెంట్గా హైదరాబాద్కు మకాం మార్చారు. ఏదో చుట్టపు చూపు కింద, లేదా కోర్టు వాయిదాలకు మాత్రమే గుడివాడ వస్తున్నారు. నిజానికి 2024 ఎన్నికల ముందే ఇదే తన చివరి ఎన్నిక అని.. తర్వాత మళ్లీ పోటీ చేసేది లేదన్నారు కూడా. ముక్కుసూటి, దూకుడు రాజకీయ శైలి వల్లే కొడాలి నాని విమర్శల పాలయ్యారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ప్రస్తుతం నాని గుండె ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైసీపీ కార్యక్రమాలకు కూడా నాని దూరంగానే ఉంటున్నారు.
అయితే ప్రస్తుతం కొడాలి నాని భవిష్యత్తుపై రాజకీయ ఊహాగానాలు హాట్ టాపిక్గా మారాయి. 2024 ఎన్నికల తర్వాత నాని బయట కనిపించటం లేదు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ ఇటీవల వరుసగా బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరుతున్నారా.. అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బీజేపీ సీనియర్ నేత, నాగ్పూర్ సౌత్ ఎమ్మెల్యే మోహన్ మాటేతో నాని అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. మోహన్ మాటే మహారాష్ట్రలో బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం ఫడ్నవీస్తో మోహన్ మాటేకు అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో నాని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారా అనే ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.
Also Read : హోండా కొత్త SUV.. ఫీచర్లు చూస్తే షాక్..!
మోహన్ మాటేతో కలిసి నాని ప్రముఖ దేవాలయాల సందర్శన, లింగవరంలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనడం గుడివాడ సహా పరిసర ప్రాంతాల్లో రాజకీయ చర్చలను మరింత తీవ్రతరం చేశాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి నాయకులు గతంలో పార్టీ మారిన ఉదాహరణలు ఉన్నాయి. ఇక 2024 ఎన్నికల తర్వాత కూడా వైసీపీ నుంచి చాలా మంది నేతలు బీజేపీలో చేరారు. దీంతో నాని కూడా కాషాయ కండువా కప్పుకుంటారా.. అనే చర్చ జరుగుతోంది. ఈ ఊహాగానాలకు కొడాలి నాని తరఫు నుంచి ఎలాంటి బ్రేకులు పడటం లేదు. వీటిని నాని సహా ఆయన సన్నిహితులు కూడా ధృవీకరించలేదు, ఖండించలేదు. నిజానికి రెండేళ్లుగా నాని మౌనం పాటిస్తున్నారు. ఈ పరిణామాలు ఒక ముఖ్యమైన మార్పునకు సంకేతమా లేక కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయా అనే దానిపై రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

