గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. మేడ్చల్ లో ఆమె కీలక ప్రకటన చేసారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ప్రాబల్యాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) భారత్ రాష్ట్ర సమితి గా మారిన తర్వాత, తెలంగాణ సెంటిమెంట్ కొంత బలహీనపడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది.
Also Read : రేవంత్ కొత్త మాస్టర్ ప్లాన్.. కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందా..?
ఇప్పుడు కవిత.. తన కొత్త పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టి, పొడి అక్షరాల్లో మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరు వచ్చేలా ప్లాన్ చేయడం మాస్టర్ స్ట్రోక్ గా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన టీఆర్ఎస్ బ్రాండ్ ను ఆమె తన ఖాతాలో వేసుకున్నట్లు కనిపిస్తోంది. కొత్త పార్టీ పేరు కోసం చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరి నిమిషంలో తెలంగాణ రాష్ట్ర సేన వైపే కవిత మొగ్గు చూపారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడే సేనగా ఇది ఉంటుందని ఆమె కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Also Read : అమెరికా, చైనాలో ఏం జరుగుతోంది..? 20 మంది టాప్ సైంటిస్టుల మాయం..!
బీఆర్ఎస్ కు ప్రాణం పోసిన పాత టీఆర్ఎస్ మూలాలను మళ్ళీ తన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆమె ప్రధాన వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇది బీఆర్ఎస్ కు మద్దతుగా ఉంటుందా లేక స్వతంత్రంగా తన బలాన్ని నిరూపించుకుంటుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అయితే, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులను, కేడర్ను తన వైపు తిప్పుకోవడంలో ఈ టీఆర్ఎస్ పేరు కవితకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.

