ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకల పట్ల ఆలయ అధికారులు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం అనే విమర్శలు వస్తున్నాయి. ఆడిటింగ్ పేరుతో అమ్మవారి బంగారు వస్తువును ఏకంగా చెత్తకుండీలో పడేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆలయంలోని బంగారు ఆభరణాల లెక్కింపు కోసం 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
Also Read : తల్లి చనిపోయిన బాధను మింగుతూ.. ఫస్ట్ ఓవర్ లో వికెట్..!
గత కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. అయితే, ఈ తనిఖీల్లో భాగంగా ఒక బంగారు వస్తువును చెత్తకుండీలో వేయడం అధికారుల పనితీరుపై తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. అది పొరపాటున జరిగిందా లేక కావాలనే పక్కదారి పట్టించే ప్రయత్నమా..? అనే కోణంలో భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో దుర్గమ్మ గుడి అధికారులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. భద్రతా పరమైన లోపాలు ఒకవైపు, అవినీతి ఆరోపణలు మరోవైపు ఆలయ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.
Also Read : అసలు బాబుకు లేని నొప్పి నీకెందుకు..?
కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్నా, ఇలాంటి ఘటనలు జరగడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ పలువురు మండిపడుతున్నారు. గతంలోనూ వెండి రథం సింహాల అపహరణ వంటి ఘటనలు మర్చిపోకముందే, ఇప్పుడు బంగారం విషయంలో ఇలాంటి ప్రవర్తన భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. సామాన్య భక్తుడు ఒక చిన్న వస్తువును లోపలికి తీసుకెళ్లాలన్నా వంద నిబంధనలు పెట్టే అధికారులు, కోట్లాది రూపాయల విలువైన అమ్మవారి సొత్తు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. మరో మూడు రోజుల పాటు ఈ ఆడిటింగ్ కొనసాగనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు సెక్యూరిటీ ఏజెన్సీ ప్రవర్తనపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

