రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది అందరికీ తెలుసు. 2014 ముందు వరకు రాజకీయాల్లో హుందాతనం ఉందనేది వాస్తవం. రాజకీయ నేతలు ఎవరి పైనా వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లు కాదు. కేవలం పార్టీ పరంగా రాజకీయ పరమైన విమర్శలు మాత్రమే చేసే వాళ్లు. కానీ 2014 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు తారాస్థాయికి చేరాయి. రాయలేని బాషలో రెచ్చిపోయారు వైసీపీ నేతలు. చివరికి కుటుంబ సభ్యులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా కేవలం పార్టీ అధినేత పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగమని ఇప్పటికీ తెలుసుకోలేక పోతున్నారు కొందరు నేతలు. తమను బండ బూతులు తిట్టిన వారిని ఆ పార్టీల నేతలు తిరిగి తీసుకోరనేది వైసీపీ అధినేత ప్లాన్. కాబట్టి చివరికి వరకు ఆ నేతలు ఏ పార్టీలోకి వెళ్లలేరు.
Also Read : ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్ పై డీజీపీ సంచలన ఆదేశాలు..!
అయితే కొంతమంది నేతలు మాత్రం ముందుగానే ఈ విషయం పసిగట్టారు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు కూడా తమ ప్రతిపక్ష నేతలపై ఎలాంటి విమర్శలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత వైసీపీ పైన ప్రజల్లో నమ్మకం లేదని గుర్తించిన సదరు నేతలు సైలెంట్గా జగన్కు గుడ్ బై చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు. అయితే అలా చేరిన వారిలో చాలా మంది నేతలు ఇప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో ఇమడలేక పోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇప్పటికీ నేతల మధ్య సఖ్యత లేదు. పైగా చాలా మంది నేతలు కూటమి పార్టీల నేతలపైనే సవాళ్ల పర్వం కొనసాగుతుంది.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలు కూటమి పార్టీలో చేరారు. వీరికి ఆయా నియోజకవర్గాల నేతలతో ఎన్నో ఏళ్లుగా రాజకీయ వైరం ఉంది. చివరికి వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత ఆయా నేతలు ఇప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనలేకపోతున్నారు. అలాగే కూటమి నేతలను కలుపుకుని వెళ్లడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రేపల్లెలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ కలిసి పాల్గొన్నారు. ఇద్దరి మధ్య గతంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ వారిద్దరు ఆ వేడుకల్లో చాలా సరదాగా కనిపించారు.
Also Read : కోహ్లీ జ్వరంతో బ్యాటింగ్ చేసాడా..? అసలేం జరిగింది..?
అయితే అనగాని, మోపిదేవి కలిసినట్లుగా ఇతర నేతలు మాత్రం కలిసినట్లు కనిపించటం లేదు. ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్కు మాజీ మంత్రి, ప్రస్తుత జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డికి మధ్య వైరం అలాగే కొనసాగుతోంది. ఒకదశలో ఒకరిపై ఒకరు పరోక్షంగా సవాళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చిన్ని, మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత ఆళ్ల నాని మధ్య కూడా సఖ్యత కనిపించటం లేదు. ఇద్దరు కలిసి ఒక్కసారి కూడా వేదిక పంచుకున్న దాఖలాలు లేవు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జనసేన నేత సామినేని ఉదయభాను మధ్య వైరం అలాగే ఉంది. ఈ ఇద్దరు నేతలు కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనటం లేదు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ మారిన నేతలను కలుపుకుని పోయేందుకు సీనియర్లు మొగ్గు చూపించటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీల అధినేతలు కలిసే ఉన్నప్పటికీ.. నియోజకవర్గం స్థాయి నేతలు మాత్రం కలిసి పనిచేయటంలో కాస్త అసహనం చూపిస్తున్నారు.

