బెజవాడలో వెలుగుచూసిన ఉగ్ర లింకుల కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ కేసులో కీలక నిందితురాలు, హైదరాబాద్ కు చెందిన సైదా బేగం విచారణలో ఎన్ఐఏ అధికారులకు కళ్లు బైర్లు గమ్మే నిజాలు వెలుగులోకి తెచ్చారు. అమాయక మహిళలను, యువతను టార్గెట్ చేస్తూ ఆమె ఒక భారీ జిహాదీ నెట్వర్క్ ను నడుపుతున్నట్లు గుర్తించారు. సైదా బేగం ‘KHAWATEEN’ (ఖవాతీన్) పేరుతో ఒక రహస్య వాట్సాప్ గ్రూపును నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read : పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!
ఇందులో ఇప్పటికే 42 మంది యువతులను రిక్రూట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ గ్రూపులో ఒసామా బిన్ లాడెన్ ప్రసంగాలు, వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్ వీడియోలను షేర్ చేస్తూ వారి మైండ్ ను డైవర్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. కేవలం ప్రసంగాలు వినిపించడమే కాకుండా, వీరికి క్షేత్రస్థాయిలో ఆయుధ శిక్షణ ఇవ్వాలని సైదా బేగంకు అంతర్జాతీయ జిహాదీ ముఠాల నుంచి ఆదేశాలు అందినట్లు తేల్చారు. మహిళలను ఆత్మహుతి దళాలుగా మార్చడమే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తోందని, దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
Also Read : దేవాదాయ శాఖలో ఏసీబీ “శాంతి” హోమం..!
హైదరాబాద్ కు చెందిన మహిళ అయినప్పటికీ, విజయవాడలో ఉగ్ర లింకులు బయటపడటం వెనుక ఏపీలో ఏదైనా భారీ విధ్వంసానికి ప్లాన్ చేశారా..? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. పట్టుబడిన సైదా బేగం సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్న ఎన్ఐఏ, ఆ 42 మంది యువతులు ఎక్కడ ఉన్నారు..? వారి నేపథ్యం ఏంటి..? అనే విషయాలను ఆరా తీస్తోంది. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.

