ఆంధ్రప్రదేశలో నియోజకవర్గాల పునర్విభజన చర్చలు వేగం పుంజుకోవడంతో ఎమ్మెల్యేల రాజకీయ దృష్టి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ అనిశ్చితి నేపథ్యంలో ప్రజల మధ్య కంటే వ్యక్తిగత వ్యాపారాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడిచినా, ప్రజాప్రతినిధుల పనితీరుపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత వ్యాపారాలు, వ్యవహారాల్లోనే ఎక్కువగా నిమగ్నమై ఉన్నారని స్వయంగా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ప్రజలకు చేరువ కావాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో టికెట్లు కష్టమవుతాయని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
Also Read : పుకార్లకు చెక్.. కేరళలో తారక్ కలరిపట్టు వేట..!
అయితే ఈ హెచ్చరికల మధ్య కూడా చాలా మంది నాయకుల వ్యవహార శైలి మారలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు నేతలు కేవలం ప్రదర్శనాత్మకంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా, మరికొందరు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే, నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కొత్తగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండగా, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మండలాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ స్థానాల మార్పులు కూడా చోటుచేసుకునే అవకాశముందని అంచనా.
Also Read : బుమ్రాకే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు..!
ఈ నేపథ్యంలో ‘ఇప్పుడే నియోజకవర్గంలో తిరిగి ప్రయోజనం ఏముంది? రేపటికి అదే నియోజకవర్గం ఉంటుందో లేదో తెలియదు’ అన్న భావన కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పెరుగుతోందని సమాచారం. దీంతో ప్రజా సేవకంటే వ్యక్తిగత వ్యాపారాలపై దృష్టి మళ్లిస్తున్నారన్న విమర్శలు బలపడుతున్నాయి. రానున్న ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉండటంతో, చాలా మంది నాయకులు ముందస్తు జాగ్రత్తగా తమ ఆర్థిక వ్యవహారాలను బలోపేతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా పునర్విభజన ప్రక్రియ రాజకీయ నాయకులకు ఒక విధంగా సౌకర్యంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

