వైసీపీ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా.. వెనుక భారీ అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. ఈ వ్యవహారంపై ఏకంగా 30 వేల పేజీల నివేదికను విజిలెన్స్ అధికారుల బృందం ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో మాజీ మంత్రి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిల పాత్రపై కీలక విచారణ జరపాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. క్రీడల నిర్వహణ, కిట్ల పంపిణీ, ప్రచారం పేరుతో దాదాపు రూ. 40 కోట్లు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ నిర్ధారించింది.
Also Read : తమిళనాడులో అలా.. మరి ఏపీలో..!
నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, మార్కెట్ ధర కంటే ఎక్కువ రేట్లకు స్పోర్ట్స్ మెటీరియల్ కొనుగోలు చేయడం వంటి అక్రమాలు జరిగినట్లు రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ స్కామ్లో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి లు కీలక సూత్రధారులని విజిలెన్స్ తన నివేదికలో వేలెత్తి చూపింది. కేవలం రాజకీయ నాయకులే కాకుండా, అప్పటి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారుల చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. శాప్ అప్పటి ఇన్ఛార్జ్ ఎండీ హర్షవర్ధన్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఐఏఎస్ అధికారి ధ్యాన్ చంద్, రిటైర్డ్ ఐఏఎస్ వాణిమోహన్ లకు ఉచ్చు బిగుస్తోంది.
Also Read : కేసీఆర్ బయటకు వస్తారా.. రారా..?
వీరందరిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ గట్టిగా సిఫార్సు చేసింది. నిధుల మళ్లింపులో వీరి పాత్రపై సాక్ష్యాధారాలను సేకరించినట్లు సమాచారం. విజిలెన్స్ సమర్పించిన ఈ 30 వేల పేజీల నివేదిక ఆధారంగా కూటమి ప్రభుత్వం తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా రోజాపై క్రిమినల్ కేసులు నమోదైతే ఆమెకు మరిన్ని చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

