కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన వారు, అదుపు తప్పి ప్రవర్తించడంపై ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ప్రవర్తనను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యేలకు క్రమశిక్షణపై క్లాస్ తీసుకున్న సీఎం, పని ఒత్తిడి లేదా టెన్షన్ ఉంటే మెడిటేషన్ చేసుకోవాలని సూచించారు.
Also Read : ఈసారి మావిగన్ అంటున్న జగన్
“మీకు టెన్షన్ ఉంటే ధ్యానం చేయండి, అంతేకానీ ఆవేశంలో అదుపు తప్పి ప్రవర్తిస్తే ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి” అని హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి చట్టాన్ని అతిక్రమించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఒక సంఘటనపై స్పందిస్తూ, “నిన్న మన ఎమ్మెల్యే ఒకరు వెళ్లి వేరే ఆఫీసు మీద పడ్డారు. అసలు ప్రభుత్వ కార్యాలయాల మీద పడటం ఏంటి? ఇది మన సంస్కృతి కాదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులతో లేదా వ్యవస్థలతో ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, ఇలా దాడులకు దిగడం పద్ధతి కాదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.
Also Read : నేటి నుంచి అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. కీలక మార్పులు ఇవే..!
ఎమ్మెల్యేలు తమ ప్రవర్తనను మార్చుకోవాలని చెబుతూనే, ఒక ఆసక్తికరమైన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. కొందరు ఎమ్మెల్యేలు క్రైమ్ సీరియల్స్ చూసి ప్రభావితం అవుతున్నారని, వాటిని చూసి మనసు పాడు చేసుకోవద్దని సూచించారు. “క్రైమ్ సీరియల్స్ చూసి కంట్రోల్ తప్పుతున్నారు. సీరియల్స్ చూసి ప్రవర్తన మార్చుకోవడం మానేసి, ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టండి” అని చంద్రబాబు హితబోధ చేశారు. కూటమి ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యేపై ఉందని, పద్ధతి మార్చుకోని పక్షంలో చర్యలు తప్పవని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరోక్షంగా హెచ్చరించారు.

