కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్.. కాగ్ తీవ్రమైన విశ్లేషణ వెలువరించింది. ఇందులో తీవ్రమైన లోపాలను ఎత్తిచూపుతూ, బీఆర్ఎస్ లేవనెత్తిన ఆందోళనలను ధృవీకరించింది. ఈ నివేదిక ఒక మేల్కొలుపు అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అభివర్ణించారు. రెండు సంవత్సరాల మూడు నెలల కాంగ్రెస్ పరిపాలనలో అవాస్తవిక బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, వనరుల దుర్వినియోగం వంటివి ఈ నివేదిక బట్టబయలయ్యాయని హరీష్ ఆరోపించారు.
Also Read : అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎస్పీ..!
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదిక, బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాలను వెల్లడించింది. బడ్జెట్లో కేటాయించిన రూ.2,21,242 కోట్ల నుండి, కేవలం రూ.1,67,804 కోట్లు మాత్రమే సమకూరాయి. ఇది అంచనా వేసిన రాబడిలో 75 శాతాన్ని మాత్రమే సాధించింది. అదేవిధంగా, రూ.2,20,945 కోట్ల రాబడి వ్యయ అంచనాలకు బదులుగా, వాస్తవంగా రూ.1,77,224 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇది ప్రణాళికాబద్ధమైన వ్యయంలో సుమారు 80 శాతం మాత్రమే. సామాజిక సంక్షేమ, నీటిపారుదల పథకాల అమలులో నిధులు కేటాయించినప్పటికీ, వాటిలో అధిక భాగం ఖర్చు కాకపోవడంతో, విస్తృతమైన అసమర్థతను ఈ నివేదిక ఎత్తి చూపింది.
Also Read : ధర్నా వ్యవహారంపై సిఎం ఆరా.. షాక్ అయిన అధికారులు..!
భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలను ఆస్తులుగా మార్చడంలో విఫలమైందని, ఇది రికార్డు స్థాయిలో రెవెన్యూ లోటుకు దారితీసిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో 2023-24లో రూ.779 కోట్ల మిగులుగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ పరిస్థితి, 2024-25 నాటికి రూ.9,420 కోట్ల లోటుకు పడిపోయింది. పేలవమైన ప్రణాళిక, విధానపరమైన తప్పిదాల ద్వారా తెలంగాణ ఆర్థిక పునాదులను ప్రభుత్వం బలహీనపరిచిందని, దీనివల్ల వ్యాపారం, రియల్ ఎస్టేట్, పరిశ్రమల వంటి కీలక రంగాలు దెబ్బతిన్నాయని, ఫలితంగా జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, వాహన పన్ను రాబడులు తగ్గాయని హరీష్ విమర్శించారు.
Also Read : నాయుడుపై వేటు.. కొత్తగా సీనియర్ నేత..!
సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పేలవమైన పనితీరును కాగ్ నివేదిక బయటపెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన రూ.25,971 కోట్లలో కేవలం రూ.9,721 కోట్లు.. అంటే 37 శాతం మాత్రమే ఖర్చు చేశారు. రాజకీయ హామీలు ఇచ్చినప్పటికీ, అణగారిన వర్గాలకు మద్దతుగా నిధులను సమర్థవంతంగా వినియోగించలేదని కాగ్ నివేదికలు స్పష్టం చేశాయి. పాలమూరు – రంగారెడ్డి, కాళేశ్వరం, హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా, మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ మిషన్ కేటాయింపులలో వైఫల్యాలను ఉదహరిస్తూ, భారీగా రుణాలు తీసుకున్నప్పటికీ ఈ నిధులు సక్రమంగా వినియోగించబడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం మౌలిక సదుపాయాలు మరియు మూలధన ప్రాజెక్టుల వరకు కూడా విస్తరించిందని హరీష్ రావు ఆరోపించారు.
2034 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న ప్రభుత్వ ఆశావహ వాదనలను కూడా కాగ్ నివేదిక ప్రశ్నించింది. సాధించిన 9 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు అటువంటి అంచనాలను అవాస్తవికంగా మారుస్తోందని పేర్కొంది. రాజకీయ ప్రేరేపిత, కక్షపూరిత నిర్ణయాలను వీడి.. క్రమశిక్షణతో కూడిన పాలనపై దృష్టి పెట్టాలని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కాగ్ నివేదిక ఒక హెచ్చరిక – రాష్ట్ర ఆర్థిక పునాదులను బలోపేతం చేయండి, ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వండి, వనరులు అత్యంత అవసరమైన వారికి చేరేలా చూడండి,” అని హరీష్ సూచించారు. కాగ్ నివేదిక, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తూనే, క్రమశిక్షణతో కూడిన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత పాలన కావాలన్న బీఆర్ఎస్ వాదనను బలపరుస్తుంది.

