అమరావతిలో ఇటీవల గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్టర్లు చేపట్టిన ధర్నా వ్యవహారం సిఎం చంద్రబాబు దృష్టికి చేరడం సంచలనం అయింది. జల్ జీవన్ మిషన్ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తమకు అన్యాయం జరుగుతోందని కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం సిఎం దృష్టికి వెళ్ళడంతో అధికారులపై ఫైర్ అయ్యారు. అసలు నిధులు విడుదలైనప్పటికీ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఉన్నతాధికారులను ఆరా తీయడం ఇప్పుడు అమరావతిలో హాట్ టాపిక్ అయింది.
Also Read : అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎస్పీ..!
బిల్లుల పంపిణీలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన సిఎం.. అధికారులకు క్లాస్ పీకారు. క్షేత్రస్థాయిలో తక్కువ మొత్తంలో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు అందకపోగా, పెద్ద మొత్తంలో పనులు చేసే కాంట్రాక్టర్లకు భారీగా నిధులు వెళ్లినట్లు సమాచారం అందడంతో అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. చిన్న కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, కేవలం పెద్ద కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇచ్చి బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం.. సంబంధిత శాఖ అధికారులను నిలదీశారు. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
Also Read : ఏపీలో ముగిసిన మావోల శకం.. ఆపరేషన్ కగార్ సక్సెస్..!
చిన్న కాంట్రాక్టర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల విడుదల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఉరుకులుపరుగుల మీద చర్యలు చేపట్టినట్టు సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా, పెండింగ్ బిల్లులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని సిఎం ఆదేశించడం, ఈ వ్యవహారంపై స్వయంగా సిఎం ఆరా తీయడంతో అధికారులు కంగుతిన్నారు.

