ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ ఏపీలో తన లక్ష్యాన్ని చేరుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీలో అత్యంత కీలక నేతగా ఉన్న చల్లా నరసింహరావు సహా మరో 10 మంది ముఖ్య నేతలు ఏపీ డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఎదుట లొంగిపోవడంతో ఏపీలో మావోయిస్ట్ పార్టీ ప్రస్తానం ముగిసింది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంటూ, ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలను నడిపిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు చల్లా నరసింహరావు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.
Also Read : ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్..!
అయితే, ఆపరేషన్ కగార్ కింద పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం, కేంద్రం గడువు దగ్గర పడటంతోనే లొంగిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దుల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ మావోయిస్టుల నెట్వర్క్ను దెబ్బతీయడానికి ఏపీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ను రూపొందించారు. ఆధునిక టెక్నాలజీని వాడుతూ వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా వారిని లొంగిపోయేలా ఒత్తిడి తీసుకువచ్చారు. చల్లా నరసింహరావు వంటి అగ్రనేత లొంగిపోవడంతో ఏపీలో మావోయిస్టు వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.
Also Read : 25 కోట్ల ప్లేయర్.. ఒక్క బంతి కూడా వేయకుండానే..!
ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉన్న విశాఖ మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా వంటి ప్రాంతాల్లో ఇప్పుడు శాంతి నెలకొంటోంది. అగ్రనేతల లొంగుబాటుతో మిగిలిన కేడర్ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పోలీసుల వ్యూహాత్మక దాడులు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు మావోయిజం పట్ల యువతలో ఆసక్తి తగ్గడానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. అటు తెలంగాణాలో కూడా మావోయిస్ట్ పార్టీ ప్రస్తానం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. మరొక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో గణపతి లొంగిపోతారా లేదా అనేది చూడాలి.

