ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి, సైబర్ భద్రతను మరింతగా మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ ఫ్లాట్ఫాంలకు సరికొత్త నిబంధనలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన ‘సిమ్-బైండింగ్’ ప్రక్రియను పూర్తి చేయడానికి గడువును పొడిగించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల సాధారణ వినియోగదారులకు, టెక్ కంపెనీలకు సాంకేతిక సర్దుబాట్లు చేసుకోవడానికి మరింత సమయం దొరకనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : 25 కోట్ల ప్లేయర్.. ఒక్క బంతి కూడా వేయకుండానే..!
సాధారణంగా మనం వాట్సాప్ వాడేటప్పుడు ఒకసారి ఓటిపి ద్వారా లాగిన్ అయితే, ఆ తర్వాత ఫోన్ లో సిమ్ కార్డ్ లేకపోయినా వైఫై ద్వారా మెసేజ్ లు పంపవచ్చు. కానీ, సైబర్ నేరగాళ్లు దీనిని ఆసరాగా చేసుకుని ఇతరుల నంబర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. సిమ్-బైండింగ్ నిబంధన అమల్లోకి వస్తే, ఏ నంబర్తో అయితే వాట్సాప్ నడుస్తుందో, ఆ సిమ్ కార్డ్ కచ్చితంగా అదే ఫోన్ లో ఉండాలి. సిమ్ తీసేస్తే లేదా వేరే ఫోన్లోకి మారిస్తే యాప్ పనిచేయదు. ఇది యూజర్ల భద్రతను మరింత పెంచుతుంది.
మొదట నిర్ణయించిన గడువులోగా ఈ సాంకేతిక మార్పులను తీసుకురావడం మెసేజింగ్ ప్లాట్ఫారమ్ లకు సవాలుగా మారింది. కోట్ల మంది వినియోగదారులు ఉన్న నేపథ్యంలో, ఒక్కసారిగా ఈ నిబంధనను అమలు చేస్తే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అందుకే, వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ డెడ్లైన్ను మరికొంత కాలం పొడిగించేలా కనిపిస్తోంది.
Also Read : ఒంటిమిట్ట కల్యాణం పౌర్ణమి నాడే.. రాత్రిపూట ఎందుకు..?
ఈ నిబంధన అమలులోకి వస్తే, ఫేక్ అకౌంట్ల ద్వారా జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విదేశీ నంబర్లతో లేదా వర్చువల్ నంబర్లతో వాట్సాప్ క్రియేట్ చేసి అమాయకులను బురిడీ కొట్టించే అవకాశం ఉండదు. అయితే, ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు వాడేవారు లేదా తరచుగా సిమ్ కార్డులు మార్చేవారు కొంత ఇబ్బంది పడవచ్చు. కానీ, దేశ భద్రత మరియు సైబర్ క్రైమ్ నియంత్రణ దృష్ట్యా ఇది ఒక కీలక అడుగు అని ప్రభుత్వం భావిస్తోంది.

