ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం భారత్ పై కూడా తీవ్రంగా పడుతోంది. ఈ నేపధ్యంలో.. దేశంలో వంట గ్యాస్ కొరత తలెత్తే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం, సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, గతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా మళ్లీ సుపీరియర్ కిరోసిన్ పంపిణీని ప్రారంభించాలని నిర్ణయించింది.
Also read : వైసీపీలో పునర్విభజన భయం..!
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ను సరఫరా చేయనున్నారు. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి గతంలో కిరోసిన్ పంపిణీ నిలిపివేసిన రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు వంట, ఇతర అవసరాల కోసం ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
Also read : ద్వారంపూడికి చెక్..? ఫోకస్ పెట్టిన సర్కార్..!
ఈ పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన రెండు పెట్రోల్ బంకుల వద్ద.. అంటే ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన వాటి ద్వారా కూడా కిరోసిన్ విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. ఒక్కో విక్రయ కేంద్రం గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ ను నిల్వ ఉంచుకోవచ్చు. దీనివల్ల రేషన్ షాపులకే పరిమితం కాకుండా, ప్రజలకు మరింత సులభంగా కిరోసిన్ అందుబాటులోకి రానుంది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని, ప్రాథమికంగా 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఎనర్జీ సప్లై చైన్ మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు సామాన్యులపై భారం పడకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కేంద్రం చెప్తోంది.

