కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం అనగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు అర్ధరాత్రి వేళ జరిగే ఈ కల్యాణం వెనుక ఎంతో చరిత్ర ఉందట. ఒంటిమిట్టలోని ప్రధాన ఆకర్షణగా.. ఏకశిల రాతిలో చెక్కబడిన సీత, రామ, లక్ష్మణ విగ్రహాలు నిలుస్తాయి. సాధారణంగా రామాలయాల్లో విడిగా విగ్రహాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఒకే రాతిలో అద్భుతంగా చెక్కిన ఈ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
Also Read : శాసససభలో సరే.. మండలిలో చర్చ ఏమైంది..?
హనుమంతుడు లేకుండా కేవలం సీతారామ లక్ష్మణులు మాత్రమే కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణాకు భద్రాచలం ఉండటంతో, ఒంటిమిట్ట శ్రీరామనవమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తించి, అధికారికంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తుంది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణానికి పట్టు వస్త్రాలు, మంగళద్రవ్యాలు సమర్పిస్తారు. ఇది శైవ, వైష్ణవ సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుంది.
ఈ ఆలయానికి ధ్వజస్తంభం లేకపోవడం మరో గమనార్హం. ఆలయ నిర్మాణ శైలిలో ఇది ఒక అరుదైన అంశం. అశేష భక్తజనం మధ్య, విశాలమైన చలువ పందిరిలో కల్యాణం జరుగుతుంది. భక్తులు స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఒంటిమిట్టలో శ్రీరామ కల్యాణం పగలపూట కాకుండా, అర్ధరాత్రి వేళ నిర్వహించడం వెనుక ఒక స్థానిక పురాణం ప్రచారంలో ఉంది. స్థానికంగా చెప్పుకునే ఐతిహ్యం ప్రకారం, వనవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చారు.
Also Read : వైసీపీలో చెవిరెడ్డి శకం ముగిసినట్లే..? లిక్కర్ కేసు తర్వాత మారిన సీన్..!
ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు, సీతారాములకు అధికారికంగా వివాహం జరగలేదని గ్రహించి, ఆ రోజు అర్ధరాత్రి వేళ పండితులు, ఋషులు ప్రత్యేక పూజలు నిర్వహించి, సీతారాములకు కల్యాణం జరిపించారని కథనం. ఆనాటి నుండి, ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి నాడు, అర్ధరాత్రి వేళలో సీతారాముల కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రత్యేక సమయం కారణంగానే ఒంటిమిట్ట కల్యాణానికి భక్తులలో మరింత ప్రాధాన్యత, విశిష్టత ఏర్పడ్డాయి.

