ఇదుగో పులి అంటే.. అదిగో తోక అంటున్నట్లు ఉంది వైసీపీ నేతల తీరు. అసలేం జరుగుతుందో పట్టించుకోవటం లేదు.. ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు. ఇంకా చెప్పాలంటే.. దున్నపోతు ఈనింది అంటే.. దూడను కట్టేయండి అన్నట్లుగా ఉంది వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. నిజానిజాలు పూర్తిగా పక్కన పెట్టి.. కేవలం టార్గెట్ తెలుగుదేశం, జనసేన పార్టీలు అన్నట్లుగానే ఏదైనా ఒక విషయం జరిగితే.. దానికి రాజకీయాలతో సంబంధం లేకపోయినా సరే.. ఏదో జరిగిపోయిందన్నట్లుగా పదే పదే విమర్శలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబంధించిన విషయం అయితే మరీ ఓవర్ యాక్షన్ చేస్తూ.. తమ పరువు తామే తీసుకుంటున్నారు వైసీపీ నేతలు, అభిమానులు.
Also Read : శాసససభలో సరే.. మండలిలో చర్చ ఏమైంది..?
పర్యావరణ పరిరక్షకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఇటీవల జనసేన పార్టీ నుంచి బయటికి వచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ వెంటే ఉన్నారు బొలిశెట్టి. జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూనే పర్యావరణ పరిరక్షణ కోసం కూడా తన పోరాటం కొనసాగించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందంటూ బొలిశెట్టి సత్యనారాయణ జాతీయ హరిత ట్రైబ్యూనల్లో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో కొల్లేరు పరిరక్షణ కోసం కూడా బొలిశెట్టి పోరాడుతున్నారు. ఈ కేసులపై విచారణ జరుగుతున్నప్పటికీ 2024 ఎన్నికల్లో కూటమి తరఫున బొలిశెట్టి సత్యనారాయణ విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బొలిశెట్టి పోరాటం చేయడంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావు వ్యాఖ్యలు చేయడంతో.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
అయితే, ఇదే రాజకీయ అవకాశంగా మలుచుకున్న వైసీపీ నేతలు. బొలిశెట్టిపై లేనిపోని పుకార్లు సృష్టించారు. జనసేన పార్టీలో బొలిశెట్టికి గుర్తింపు లేదని.. ఆయనను పవన్ కల్యాణ్ పూర్తిగా పక్కన పెట్టారని.. అందుకే జనసేనకు బొలిశెట్టి రాజీనామా చేశారని పుకార్లు మొదలుపెట్టారు. మరో అడుగు ముందుకు వేసి.. ఆయన వైసీపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు కూడా. వైసీపీ అనుకూల యూ ట్యూబ్ ఛానల్స్ అయితే.. బొలిశెట్టి రాజీనామా కాదు.. జనసేన నుంచి గెంటివేత అని.. పవన్కు బొలిశెట్టి షాక్ అంటూ వైసీపీ నేతలతో పొలిటికల్ అనలిస్టు పేరుతో స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు.
తనపై జరుగుతున్న ప్రచారంపై బొలిశెట్టి సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తన భార్య మరణానంతరం తన శేష జీవితాన్ని పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల రక్షణకే అంకితం చేశానని.. ఇదే తన తుది నిర్ణయమని స్పష్టం చేశారు. “గత రెండు రోజులుగా వేరే రాజకీయ పార్టీలో చేరుతున్నానని కొన్ని అసత్య, అనైతిక సోషల్ మీడియా పోస్టులు, అలాగే కొందరు వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా టీవీ, యూట్యూబ్ చర్చల ద్వారా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గమనించాను. ఈ సందర్భంగా సోషల్ మీడియా అసత్య ప్రచారాలకు ఇక చెక్ పెట్టాలనే “నాకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశ్యం లేదు. నాకు ఎప్పుడూ పదవులపై ఆశ లేదు, ఉన్నదల్లా భావి తరాల భవిష్యత్తు కోసం ఉన్న ఆరాటం మాత్రమే.” అని నేను ప్రజలకు స్పష్టం చేస్తున్నాను.” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Also Read : చెల్లెలు కోసం అన్నకు షాక్ ఇస్తారా..? గులాబీ పార్టీలో వింత వాతావారణం..!
తన తక్షణ కార్యాచరణలో ముఖ్య అంశాలంటూ జాబితా విడుదల చేశారు. “1.కొల్లేరు సరస్సు: సరస్సు సంరక్షణ, పునరుద్ధరణ. 2.వ్యవసాయ భూముల రక్షణ: వ్యవసాయ, అటవీ భూముల అనవసర భూవినియోగ మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం. 3.ప్రకృతి సంరక్షణ: కొండకర్ల ఆవ రక్షణతో పాటు, విశాఖ నుండి కాకినాడ వరకు తీరప్రాంత జీవవైవిధ్యాన్ని కాపాడడం. 4.పర్యావరణ పరిరక్షణ: భీమిలిలోని ఎర్ర మట్టి దిబ్బలు, చిల్లపేట చెరువు, కంబాలకొండ, సింహాచలం పరిసరాల్లోని ఎకో-సెన్సిటివ్ జోన్లను సంరక్షించడం, అలాగే కాకినాడ మడ అడవుల పునరుద్ధరణ. 5.పాయకరావుపేట దుర్గానగర్ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తడం, ఎస్.కోట ప్రాంతంలోని ఆదివాసీల (జిందాల్ భూములు) భూకబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం.
“ఇక కొల్లేరు ధ్వంసానికి కారణమైన శక్తులపై నా పోరాటం.. నా లక్ష్యం కొల్లేరు సరస్సు పునరుద్ధరణ, తరతరాలుగా అక్కడ జీవవైవిధ్యాన్ని కాపాడుతున్న మత్స్యకారుల బంగారు భవిష్యత్తు, ప్రకృతి విధానంలో సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం. వారి సహకారంతోనే నా ప్రయాణం పోరాటం.. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వైపు నా ప్రయాణం సాగుతుంది..” అంటూ బొలిశెట్టి తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇచ్చేశారు. అదే సమయంలో తాను వైసీపీ చేరుతున్నట్లు జరుగుతున్న పుకార్లకు కూడా ఘాటుగానే బదులిచ్చారు బొలిశెట్టి సత్యనారాయణ.

