వైసీపీలో ఒకప్పుడు కీలక నాయకుడిగా, అధినేత వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరుకుందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో, అధికారంలో ఉన్న ఐదేళ్ల పాలనలో.. ప్రభుత్వంలోనూ చక్రం తిప్పిన ఆయన, ప్రస్తుతం సొంత పార్టీలోనే ప్రాధాన్యత కోల్పోయి ఏకాకిగా మారుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించడం, ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బ తీసాయనే మాట వినపడుతోంది.
Also Read : భారతీ సిమెంట్స్ కు షాక్ తప్పదా..?
లిక్కర్ స్కామ్ కేసులో ఏ38 నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుమారు 226 రోజుల పాటు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా గడపడం.. ఆయన మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపింది. ఈ ఏడాది జనవరిలో ఆయన బెయిల్ పై విడుదలైనప్పటికీ, అప్పటికే పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గింది అనే మాట వినపడుతోంది. అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా మద్యం కుంభకోణం వంటి వివాదాస్పద కేసుల్లో చిక్కుకున్న నేతలకు అండగా నిలబడితే, కూటమి ప్రభుత్వానికి విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుందని భావించిన జగన్ అటువంటి నాయకులను పరోక్షంగా దూరం పెడుతున్నట్లు ఆ పార్టీలో చర్చ మొదలైంది.
Also Read : ఇరాన్ కు ట్రంప్ భారీ ఊరట.. డెడ్ లైన్ పెంచిన అమెరికా..!
గతంలో పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్న చెవిరెడ్డి, ఇప్పుడు కనీసం మీడియా ముందు కనపడటం లేదు. చెవిరెడ్డికి చెందిన సుమారు రూ. 63 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు ప్రభుత్వం సిద్ధమవ్వడం, ఆయన కుమారుడు మొహిత్ రెడ్డిపై కూడా కేసులు నమోదు కావడం ఆయనను మరింత ఆత్మరక్షణలో పడేశాయనే మాట వినపడుతోంది. జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్ను మర్యాదపూర్వకంగా కలిసినా, పార్టీ నుంచి ఆశించిన మద్దతు కానీ, గతంలో ఉన్న ప్రాధాన్యత కానీ లభించలేదు. ఇప్పుడు కేవలం కోర్టు వాయిదాలకే పరిమితమవుతూ, రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు పార్టీకి ట్రబుల్ షూటర్గా ఉన్న నాయకుడు, నేడు తన సొంత సమస్యల నుంచే బయటపడలేక సతమతమవుతుండటం గమనార్హం.

