ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసీ రెడ్డి, మద్యం ముడుపుల ద్వారా ఆర్జించిన అక్రమ సొమ్ముతో తెలంగాణలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో గుర్తించారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల పేరిట కోట్లాది రూపాయల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు ఆధారాలు సేకరించింది సిట్. సిట్ దర్యాప్తు ప్రకారం, రాజ్ కేసీ రెడ్డి తన తండ్రి ఉపేంద్ర రెడ్డి పేరు మీద తెలంగాణలోని జనగామ ప్రాంతంలో భారీగా ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశారు.
Also Read : అమరావతి చట్టబద్దత.. వైసీపీ సవాల్.. ధైర్యం ఉందా..?
అలాగే, రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో తన తల్లి సుభాషిణి పేరిట ఏకంగా 17.60 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆస్తులన్నీ మద్యం సిండికేట్ల ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతోనే సమకూర్చుకున్నట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ ఆస్తుల విలువకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ మాయాజాలం జరిగినట్లు సిట్ గుర్తించింది. ఈ భూముల అసలు మార్కెట్ విలువ సుమారు రూ. 70.36 కోట్లు ఉండగా, రికార్డుల్లో మాత్రం కేవలం రూ. 2.85 కోట్లుగా మాత్రమే చూపించారు.
Also Read : సీట్ల పెంపు.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..?
మిగిలిన భారీ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని తప్పించుకోవడంతో పాటు, అక్రమ సొమ్మును దాచేందుకు ఈ పద్ధతిని అనుసరించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ ఆస్తులపై ఏపీ సర్కార్ దృష్టి సారించింది. ఆ ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైంది. జనగామ, షాబాద్ ప్రాంతాల్లో గుర్తించిన ఈ రూ. 70.36 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసేందుకు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజీత్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

