పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆకివీడులోని పెద్ద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రఘురామ కృష్ణరాజు అక్కడికి వచ్చారు. అయితే రఘురామ వస్తున్న విషయం తెలుసుకున్న కొంతమంది క్రిస్టియన్ సంఘాలకు చెందిన యువకులు, ప్రతినిధులు నిరసన వ్యక్తం చేసేందుకు యత్నించారు. తమ వర్గాన్ని కించపరిచేలా రఘురామ వ్యాఖ్యలు చేశారని.. తమను దూషిస్తున్నారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. తక్షణమే రఘురామ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రఘురామ కృష్ణరాజుపై రాళ్ల దాడి జరిగింది.
నిరసనల మధ్య ఆలయంలోనికి వెళ్లేందుకు రఘురామ యత్నించారు. పోలీసు బందోబస్తుతో రఘురామ ఆలయంలోకి వెళ్లడంతో.. ఆగ్రహానికి గురైన నిరసన కారులు.. రాళ్లు, మేకులతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. రాళ్ల దాడిలో డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్లోని కొన్ని వాహనాలు దెబ్బ తిన్నాయి. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. గాయపడిన వారిని హుటాహుటిన భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దాడి జరిగిన సమయంలో కొందరు వైసీపీ మూకలున్నారని.. వారే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాళ్ల దాడికి పాల్పడినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై అనేక అనుమానాలున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ దాడి వెనుక ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఉన్నారని సందేహం వ్యక్తం చేశారు. ఆయన ప్రమేయంతోనే తనపై దాడి జరిగిందని రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి వెంటనే చర్యలు చేపడతామని రఘురామ ఇటీవల వ్యాఖ్యానించారు. సునీల్ కుమార్ ఎస్సీ కాదని వ్యాఖ్యానించారు కూడా. అలాగే గతంలో రఘురామను కస్టడీయల్ టార్చర్ చేసిన వ్యవహారంలో సునీల్కుమార్పై కేసు ఉంది. మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి ఇరువురి మధ్య వాగ్యుద్ధం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన దాడి వెనుక ఆయన ప్రమేయం ఉందన్న సందేహాలు వస్తున్నాయి.

