గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం, తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనుంది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాల వెనుక ఉన్న అసలు కారణాలను ఈ బృందం వెలికితీయనుంది.
Also Read : షుగర్ లెవల్స్ పెరగకుండా కడుపు నిండాలా..? అయితే ఇది తినండి..!
కేవలం ప్రమాద వశాత్తూ ఇవి జరుగుతున్నాయా..? లేక అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా కావాలని చేస్తున్న కుట్రలా..? అనే కోణంలో విచారణ జరపనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బృందంలో మొత్తం 10 మందికి పైగా కీలక అధికారులు సభ్యులుగా ఉన్నారు. తుళ్లూరు డీఎస్పీ, సంబంధిత సీఐ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలతో కూడిన పటిష్టమైన టీమ్ ఈ విచారణలో పాల్గొంటుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విచారణ వేగంగా, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : పెద్దిరెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.. గురిపెట్టి కొట్టిన సర్కార్..!
రాజధాని ప్రాంతంలోని అగ్నిప్రమాద ఘటనలపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి, పూర్తిస్థాయి సమగ్ర నివేదికను సమర్పించాలని ఏపీ ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. ముఖ్యంగా రాజధాని పనులకు సంబంధించిన మెటీరియల్, ప్లాంటేషన్ మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులు అగ్నికి ఆహుతవుతుండటంపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న తరుణంలోనే ఈ ప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ సిట్ ఏర్పాటుతో అయినా.. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరుస ప్రమాదాలకు త్వరలోనే చెక్ పడుతుందా లేదా చూడాలి.

