వైసీపీ హయాంలో అన్నీ తానై చెలరేగిపోయి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఆయన అండ చూసుకుని రెచ్చిపోయిన అనుచరులపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనుచరులకు చెందిన అక్రమ కట్టడాలు, భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరుల చెరలో ఉన్న 7.15 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఒంటరి పోరే.. అభ్యర్ధుల లిస్టు రెడీ చేసిన విజయ్..!
మదనపల్లె ఫైళ్ల దహనం కేసు విచారణ ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పుంగనూరు పరిధిలోని సదమ్, సోమల మండలాల్లోని కీలక ప్రాంతాల్లో ఈ భూములు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి అండదండలతో ఆయన అనుచరులు ఈ విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి, తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన రెవెన్యూ యంత్రాంగం, ఆ భూములు ప్రభుత్వానివే అని తేల్చి.. పక్కా ఆధారాలతో స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ముస్తాబైన ఒంటిమిట్ట.. అంగరంగ వైభవం..!
స్వాధీనం చేసుకున్న 7.15 ఎకరాల భూమి చుట్టూ అధికారులు ప్రభుత్వ భూమి – ఆక్రమణదారులు శిక్షార్హులు అనే బోర్డులను ఏర్పాటు చేశారు. గతంలో ఈ భూములకు సంబంధించి రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని, అందుకే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మునితుకారం, మాధవరెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో తగలబడిన దస్త్రాల్లో ఇలాంటి అక్రమ భూ కేటాయింపులకు సంబంధించిన వివరాలే ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

