ఏపీలో ఏ ఇద్దరు రాజకీయ నేతలను కదిపినా.. ఇప్పుడు ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. అదేమిటంటే.. “అన్న.. రాబోయే ఎన్నికల్లో మన సీటు ఉంటుందా..? మన నియోజకవర్గం ఉంటుందా.. మారిపోతుందా..? మనకు అవకాశం ఇస్తారా.. లేదా..?.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు నేతల మధ్య బాగా వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. నేతలను కలవరపెడుతున్నాయి కూడా. ఇందుకు ప్రధాన కారణం రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగుతుందనే వార్త మాత్రమే. నిజానికి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ.. ఈ వార్త వచ్చిన నాటి నుంచి ఆశావహుల సంఖ్య పెరిగిపోగా.. సిట్టింగ్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది.
Also Read : బ్రేకింగ్: జగన్ కు పెమ్మసాని డెడ్లీ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ వరకు 26 లోక్సభ స్థానాలున్నాయి. అలాగే 187 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే 2009లో నియోజకవర్గాల పునర్ విభజన కారణంగా ఏపీలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోయింది. ఏపీలో 12 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం కూడా తగ్గిపోయింది. అదే సమయంలో తమకు ఎంతో పట్టు ఉన్న నియోజకవర్గాలు కూడా రిజర్వేషన్ పరిధిలోకి రావడం, కొన్ని నియోజకవర్గాలు రద్దు కావడంతో చాలా మంది సీనియర్ నేతలు సైతం సైలెంట్గా తమ సొంత ఊర్లు వదిలేసి.. పక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి.. తమ అదృష్టం పరీక్షించుకున్నారు.
తాజాగా నియోజకవర్గాల పెంపు అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతమున్న నియోజకవర్గాలు భారీగా పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా 88 చేరనున్నాయని.. వాటితో కలిపితే 263 అసెంబ్లీ స్థానాలుంటాయని.. అలాగే ప్రస్తుతమున్న 25 లోక్సభ స్థానాల సంఖ్య కూడా 38కి చేరుతుందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. దాదాపు 20 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు అయ్యేందుకు ఎంతో కష్టపడిన నేతలు.. ఇప్పుడు ఆ నియోజకవర్గం ఉంటుందా.. పోతుందా.. అనే టెన్షన్లో ఉన్నారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో పాటు మహిళా, ఎస్సీ రిజర్వేషన్ అంశం కూడా ఇప్పుడు నేతలను కలవరపెడుతోంది.
Also Read : ముస్తాబైన ఒంటిమిట్ట.. అంగరంగ వైభవం..!
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కారణమైన అంశం నియోజకవర్గాల పునర్ విభజన. అప్పటి వరకు టీడీపీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాలు రిజర్వు కేటగిరిలో చేరిపోయాయి. ఇది కూడా టీడీపీ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. నందిగామ, కొవ్వూరు వంటి నియోజకవర్గాలు రిజర్వు కేటగిరిలోకి మారడంతో.. సీనియర్ నేతలు సైలెంట్గా ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తుందా అని నేతలు భయపడుతున్నారు. తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వైరల్ అయ్యాయి. రాబోయే ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉండాలంటూ నరేంద్ర కుమార్తెతో లోకేష్ సరదాగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్లో భాగంగా పోటీ చేయాలన్నట్లుగా లోకేష్ వ్యాఖ్యానించారు. దీంతో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, రిజర్వేషన్ల కేటాయింపు అంశంపై నేతలు భయపడుతున్నారు.
కొత్త నియోజకవర్గాల విభజన ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పటికి పూర్తి అవుతుంది.. తుది జాబితా ఎప్పుడు వస్తుందనే చర్చ నేతల్లో నడుస్తోంది. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు చేస్తే.. రేపు ఆ నియోజకవర్గం ఉంటుందా.. పోతుందా.. అనే టెన్షన్లో కూడా ఉన్నారు. చివరి నిమిషంలో నియోజకవర్గం మార్పు జరిగితే.. మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుందని నేతలంతా భయపడుతున్నారు. దీంతో కొంత మంది నేతలు ఇప్పటికే తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమకు పట్టున్న పక్క నియోజకవర్గాల్లో సైతం చాప కింద నీరులా తమ పలుకుబడి పెంచుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో ఆశావహుల్లో నయా జోష్ మొదలైంది. ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక రాజకీయ నేతలు తమ ఆశలు ఫలించే రోజు ఎంతో దూరంలో లేదని సంబరపడిపోతున్నారు.

