అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా ఇరాన్ చేసిన దాడులు ప్రపంచ ఐటీ రంగాన్ని భయపెడుతున్నాయి. ఐటీ రంగంపై ప్రపంచం ఆధారపడుతోన్న సమయంలో ఇరాన్, ఆ రంగాన్ని గురిపెట్టి అటాక్ చేసింది. తాజాగా బహ్రెయిన్ లోని అమెజాన్ సంస్థ డేటా సెంటర్ లు, వెబ్ సర్వీసెస్ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా చెప్తోంది. తన డ్రోన్ లను ఉపయోగించి ఈ అటాక్ చేసింది ఇరాన్. దీనివల్ల అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ నెట్ వర్క్ లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Also Read : అమరావతికి ఎన్నో ప్రత్యేకతలు..!
క్షిపణులు, బాంబు దాడుల నుంచి యుద్ధం ఇప్పుడు డిజిటల్ వార్ వైపు మల్లడం ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇరాన్ పరోక్షంగా ప్రకటన చేసింది. శత్రువుల సైనిక, గూఢచారి కార్యకలాపాలకు ఈ డేటా సెంటర్లు మద్దతు ఇస్తున్నాయని, అందుకే వీటిని టార్గెట్ చేశామని ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఏడబ్ల్యూఎస్ సేవలు నిలిచిపోవడంతో గల్ఫ్ ప్రాంతంలోని అనేక బ్యాంకింగ్ లావాదేవీలు, ఈ-కామర్స్ పోర్టల్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కుప్పకూలాయి.
Also Read : కుప్పకూలిన బంగారం ధరలు.. కొనేవారికి పండగే..!
బహ్రెయిన్ తో పాటు యూఏఈ లోని డేటా సెంటర్లు కూడా ప్రభావితం కావడంతో రికవరీకి మరింత సమయం పడుతుందని అమెజాన్ పేర్కొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తమ క్లిష్టమైన డేటాను బ్యాకప్ చేసుకోవాలని, కార్యకలాపాలను అమెరికా లేదా యూరప్ వంటి ఇతర ఏడబ్ల్యూఎస్ ప్రాంతాలకు తరలించాలని అమెజాన్ తన కస్టమర్లకు సూచించింది. టెక్నాలజీ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న దాడులు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయి. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ సర్వర్లను డౌన్ చేయడం ద్వారా ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయవచ్చని ఇరాన్ ఈ దాడి ద్వారా నిరూపించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

