అసలే నష్టాలు, కష్టాలతో మొదలుకాబోతున్న.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందే సంక్షోభంలో పడింది. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్ళు.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లక్ష్యంగా పాకిస్తాన్కు చెందిన సాయుధ ఉగ్రవాద సంస్థలు నేరుగా హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో కలకలం రేపుతోంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ అనుబంధ విభాగం అయిన జమాత్-ఉల్-అహ్రార్ విదేశీ ఆటగాళ్లను వెంటనే దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది.
Also Read : జగన్తో ఒంటరి పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే..!
విదేశీ ఆటగాళ్లు పాకిస్తాన్ రావొద్దని సంబంధిత క్రికెట్ బోర్డులకు సూచిస్తున్నాం. వారికి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు అని ఆ సంస్థ కమాండర్ సంచలన వార్నింగ్ ఇచ్చాడు. ఈ సీజన్ లో కరాచీ కింగ్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్, ముల్తాన్ సుల్తాన్స్ తరపున స్టీవ్ స్మిత్ బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం తన పౌరులకు ప్రయాణించవద్దు అంటూ అలర్ట్ జారీ చేసింది. దీంతో వార్నర్, స్మిత్ లు ఆడటం పట్ల అనిశ్చితి నెలకొంది. అటు ఇందన సంక్షోభం కారణంగా మ్యాచ్ లు జరుగుతాయా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
Also Read : పెట్రోల్ షార్టేజ్ లీగ్.. కామెడి పీస్ అయిన పాక్ బోర్డు..!
ఇక భద్రత, ఇంధన సంక్షోభం కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ఈ టోర్నీని కేవలం లాహోర్, కరాచీ నగరాలకే పరిమితం చేస్తూ, స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి టోర్నీ మార్చి 26 నుండి ప్రారంభం కానుంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాల బోర్డులు కూడా తమ ఆటగాళ్లను పంపే విషయంలో పునరాలోచనలో పడ్డాయి. వార్నర్, స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు తప్పుకుంటే పీఎస్ఎల్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది.

