వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యత ఓ సంచలనం. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, ఆ సంస్థలకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. వైసీపీ పెద్దలకు సన్నిహితంగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్న.. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్ల నాణ్యత, ధరలపై హైకోర్టులో దాఖలైన పిల్ ఇప్పుడు సంచలనం అయ్యాయి.
Also Read : ఉద్యోగాలకు ‘ఏఐ’ ఎసరు, 90 శాతం కంపెనీల సంచలన నిర్ణయం..?
షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిపుణులతో పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ నాణ్యత లోపిస్తే సదరు సంస్థకు భారీగా జరిమానా విధించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. తెలంగాణలో ఉన్న ధర కంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్కో ట్రాన్స్ఫార్మర్పై సుమారు 55 వేల రూపాయలు అదనంగా వెచ్చించి కొనుగోలు చేశారనే ఆరోపణలు రావడంపై అప్పట్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో విమర్శలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలో తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ అక్రమాలపై కోర్టును ఆశ్రయించారు. నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. టెండర్ నిబంధనల ప్రకారం ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను మాత్రమే సరఫరా చేయాల్సి ఉండగా, తక్కువ నాణ్యత గల వాటిని సరఫరా చేశారని వాదనలు వినిపించారు. ఈ నిర్ణయాలు ఏ స్థాయిలో జరిగాయో వివరణ ఇవ్వాలని కోర్ట్.. ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
Also Read : భారత్ పై పాక్ కుట్రలు.. అమెరికా సంచలన వార్నింగ్
ఇతర సంస్థలు టెండర్లో అర్హత సాధించకుండా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అనుగుణంగా నిబంధనలను పెట్టారని ఏబీ వాదించారు. తెలంగాణాలో ఇదే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్ లను కేవలం 39 వేల రూపాయలకే సరఫరా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో మాత్రం ఎక్కువ ధరకు సరఫరా చేసినట్టు ఏబీ ఆరోపించారు. జగన్ హయాంలో అవసరం లేకపోయినా లెక్కకు మించి ట్రాన్స్ఫార్మర్ లు కొనుగోలు చేసారని కోర్ట్ ముందు వాదనలు వినిపించారు.

