తెర వెనుక స్నేహాలు, కోర్టు గదుల్లో వ్యూహాలు, రాజకీయ లాబీయింగ్ ఎంత జరిగినా చివరికి న్యాయస్థానం ముందు వాస్తవాలే నిలబడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వ్యవహారంపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. టీటీడీ పరిపాలన, లడ్డూ కల్తీ ఆరోపణలు, విచారణలపై వివాదాల నడుమ ఈ పిటిషన్ విచారణ కీలక మలుపు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మల్య బాగ్చీల ధర్మాసనం పిటిషన్పై స్పందించిన తీరు చాలా స్పష్టంగా చెబుతుంది. కొందరు ఆశించినట్లుగా విచారణలను నిలిపివేయాలన్న ప్రయత్నానికి కోర్టు అనుకూలంగా వ్యవహరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రాజకీయంగా రక్షణ కవచంగా మారుతుందని భావించిన చర్య, చివరకు చిల్లుల గొడుగులా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read : తిరుమల పవిత్రతకు ప్రత్యేక చట్టం: బాబు సంచలన నిర్ణయం
టీటీడీ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూత్రా కోర్టులో కీలక వాదనలు వినిపించారు. గతంలో టీటీడీ తరఫున వాదించిన వ్యక్తులే ఇప్పుడు పరిపాలనాపరమైన విచారణను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని, ఇందులో దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేసు మూలాంశాన్ని బలహీనపర్చే ప్రయత్నం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పిటిషన్ వెనుక ఉద్దేశాలపై కూడా చర్చ మొదలైంది. పిటిషన్ తరఫున ప్రధాన వాదన ఏమిటంటే—రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన బహిరంగ ప్రకటనలు విచారణపై ప్రభావం చూపవచ్చని, అందువల్ల విచారణ ప్రక్రియను నిలిపివేయాలని. అయితే ధర్మాసనం ఈ వాదనను సమగ్రంగా పరిశీలించి స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన విచారణ దానంతట అదే కొనసాగవచ్చని, కోర్టు ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణకు అది అడ్డంకి కాదని తేల్చి చెప్పింది.
Also Read : భారత్ వచ్చేయండి.. స్టూడెంట్స్, టూరిస్ట్ లకు కేంద్రం వార్నింగ్..!
రెండు విచారణలు చట్టబద్ధంగా సమాంతరంగా కొనసాగవచ్చని పేర్కొంది. పిటిషన్కు తగిన న్యాయబలం కనిపించడం లేదని చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో కీలకంగా మారాయి. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయని, విచారణలు పూర్తయ్యాయని కోర్టు గమనించడం విశేషం. దీంతో విచారణలను నిలిపివేయాలన్న ప్రయత్నం ఈ దశలో ఫలించలేదని స్పష్టమైంది. రాజకీయంగా ఈ అంశంపై గతంలో చేసిన ఆరోపణలే ఇప్పుడు కోర్టు వాదనల్లో ప్రతిధ్వనించాయనే చర్చ కూడా సాగుతోంది. ముఖ్యమంత్రి ప్రకటనలనే ప్రధాన అంశంగా చూపించే ప్రయత్నం జరిగినా, వాస్తవ పరిస్థితులను కోర్టు పరిగణనలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. టీటీడీ లడ్డూ కల్తీ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందనకు దారితీశాయి. శ్రీవారి ప్రసాదంగా భావించే లడ్డూకు సంబంధించి వచ్చిన ఆరోపణలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
Also Read : మరో వివాదంలో మోహన్ బాబు యూనివర్సిటీ..!
ఈ నేపథ్యంలో విచారణలు పూర్తిగా పారదర్శకంగా జరగాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. తాజా సుప్రీంకోర్టు స్పష్టతతో లడ్డూ కల్తీపై విచారణ ఆగదని, దోషులెవరో తేల్చే వరకు ప్రక్రియ కొనసాగుతుందని సందేశం వెళ్లింది. “తాడేపల్లి ప్యాలెస్ నుంచి సుప్రీంకోర్టు మెట్ల వరకు” సాగిన ఈ వ్యవహారం రాజకీయంగా ఎంత ప్రచారం పొందిందో తెలిసిందే. అయితే చివరికి న్యాయస్థానం ముందే తుది నిర్ణయం జరుగుతుందన్న విషయాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేశాయి. భక్తుల విశ్వాసం, ధార్మిక సంస్థల ప్రతిష్ఠ, ప్రజా నమ్మకం—ఇవి రాజకీయ ప్రయోజనాల కంటే పెద్దవని ఈ కేసు మళ్లీ స్పష్టం చేసింది. విచారణలు చట్టపరంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, నిజాలు వెలుగులోకి రావడం ఇప్పుడు ఖాయంగా కనపడుతోంది.

