ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. ఈ ఏడాది జూన్ నాటికి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు నిండుతుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుత ఏపీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా 25 మంది సభ్యులు కొనసాగుతున్నారు. త్వరలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం క్యాబినెట్లో కొంతమంది పనితీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో సీనియర్ ఎమ్మెల్యేల పేర్లు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొణతాల రామకృష్ణ చాలా కాలంగా క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్నారు. అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు అవినీతి ట్యాగ్ లేని సీనియర్, వివాదాలు లేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1989లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో గెలుచుకుని గిన్నిస్ రికార్డు సృష్టించారు కూడా. కాంగ్రెస్ ఎంపీగా, పార్లమెంటులో చురుకుగా పనిచేశారు. ప్రముఖ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణతో కలిసి రాజకీయంగా ఎదిగారు.
Also Read : బ్రేకింగ్: ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు
రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన తర్వాత, 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన కొణతాల.. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఐదేళ్ల పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుండి ఏకైక మంత్రిగా ఉన్నారు. దీంతో ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత కొణతాల పొలిటికల్ కెరీర్కు బ్రేకులు పడ్డాయి. వైఎస్ఆర్ మరణం తర్వాత నాటి కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది జగన్ ప్రారంభించిన వైసీపీలో చేరారు. కానీ కొణతాల మాత్రం.. అలాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండిపోయారు.
పదేళ్ల పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న కొణతాల రామకృష్ణ.. 2024లో జనసేన పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ కోటాలో మంత్రిపదవి ఖాయమని అంతా భావించారు. అయితే జనసేన కోటాలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు క్యాబినెట్లో చోటు దక్కింది. ప్రభుత్వ విప్ లేదా క్యాబినెట్ ర్యాంకు పదవి వస్తుందని కొణతాల అభిమానులు భావించారు. కానీ.. ఏడాదిన్నర దాటినా.. అలా జరగలేదు. తాజాగా మరోసారి కొణతాల గురించి చర్చ జోరుగా జరుగుతోంది.
Also Read : ఆ సీటు ఎవరికి దక్కుతుంది..?
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ప్రశంసిస్తూ కొణతాల చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కొణతాల ప్రసంగం, ఆయన ప్రశంసల పరిధి చాలా మందిని ఆశ్చర్యపరిచాయి కూడా. ఈ ప్రసంగంపై సోషల్ మీడియాలో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. అసలు ఇంతలా ఎందుకు ప్రశంసల జల్లు కురిపించారనే అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. మరి కొంతమంది అయితే ఇప్పుడు నిజంగా అవసరమా అని పరిశీలకులు అడుగుతున్నారు.
కొణతాల అధికారం కంటే ఆత్మగౌరవానికి విలువ ఇచ్చే వ్యక్తిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. కొణతాల అంటే టీడీపీకి వ్యతిరేకం అనే ముద్ర ఉంది. రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి కూడా చంద్రబాబును పొగిడిన రోజు లేదు. తన కెరీర్లో బలమైన టీడీపీ వ్యతిరేక వైఖరినే ప్రదర్శించారు. అయితే 2024 నుంచే చంద్రబాబు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలతో కలిసి పని చేస్తున్నారు కూడా. సంకీర్ణ ప్రభుత్వం చేసిన మంచి పనిని అభినందించడం సహజమే అయినప్పటికీ, విమర్శకులు నారా కుటుంబాన్ని ప్రశంసించడాన్ని మాత్రం అసాధారణంగా భావిస్తున్నారు.
Also Read : వంగా యూనివర్స్.. స్పిరిట్ కు యానిమల్ పార్క్ కు లింక్ అక్కడే..?
కొణతాల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ, ఎవరి మీద ఈ రకమైన ప్రశంసలు చేయలేదు. అలాంటి కొణతాల అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో చంద్రబాబు కుటుంబంపైన చేసిన ప్రశంసలు అందరినీ ఆశ్చర్యానిగి గురి చేస్తున్నాయి. అసలు కొణతాల ఇలా ఎందుకు వ్యాఖ్యానించారు అనే చర్చ కూడా జరుగుతోంది. ఇది వ్యూహాత్మక మార్పును సూచిస్తుందా లేదా మరేదైనా సూచిస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
అయితే కొణతాల వ్యాఖ్యల వెనుక పెద్ద ప్లాన్ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. అందుకే కొణతాల ఇప్పటి నుంచే చంద్రబాబును మంచి చేసుకుని.. క్యాబినెట్ బెర్తు ఖరారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

