పది నిమిషాల్లో డెలివరీ.. యాప్ డెలివరీ సంస్థలు గత ఏడాది కాలంగా దీనిని బాగా ప్రమోట్ చేసాయి. స్విగ్గీ, బ్లింక్ఇట్, జెప్టో సహా అనేక యాప్స్ దీనిని ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్నాయి. దీని కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా.. వారి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డెలివరీ బాయ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా సరే పది నిమిషాల్లో ఇవ్వాలి, కస్టమర్ ను సంతృప్తి పరచాలి అంటూ ఆర్డర్లు, రూల్స్ పాస్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. దీనిపై ఇటీవల నిరసన కార్యక్రమం కూడా జరిగిన సంగతి తెలిసిందే.
Also Read : ట్రాఫిక్ చలానాలపై కఠినత్వం.. రేవంత్ పై విమర్శల వెల్లువ
తాజాగా దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్లాట్ఫామ్ల ప్రతినిధులతో సమావేశమై డెలివరీ పార్టనర్ ల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసారు. ఆ ఆదేశాల తర్వాత బ్లింకిట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు 10 నిమిషాల డెలివరీ క్లెయిమ్లను తొలగించాలని సూచించగా.. వారు కూడా సానుకూలంగా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, డెలివరీ టైం గురించి ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపధ్యంలో.. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టోతో సహా అనేక అగ్రిగేటర్ల ఎగ్జిక్యూటివ్లను మంత్రి కలిశారు.
Also Read : భారత్ తో రాజీకి ట్రంప్ అడుగులు..? టూర్ ఫిక్స్ అయిందా..?
బ్లింకిట్ తన ట్యాగ్లైన్ను “10 నిమిషాల్లో 10,000+ ఉత్పత్తులు డెలివరీ చేయబడ్డాయి” నుంచి “30,000+ ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడ్డాయి”కి సవరించిందని అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 25న, గిగ్ వర్కర్ల యూనియన్లు వేతనం పెంచాలని, సామాజిక భద్రతా ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ నిరసనలు చేసాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్ 31న దేశవ్యాప్త సమ్మె చేస్తామని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనితో స్విగ్గీ, జొమాటో డెలివరీలకు ప్రోత్సాహకాలను పెంచాయి.

