విశాఖపట్నం ఐటీ ఎకోసిస్టమ్కు మరో కీలక మైలురాయి చేరింది. ప్రపంచంలోని టాప్–5 టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించే దిశగా కీలక అడుగు వేసింది. సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) వద్ద అమెజాన్ విశాఖ డెవలప్మెంట్ సెంటర్ అధికారికంగా నమోదు కావడం ద్వారా ఈ విషయం నిర్ధారణ అయింది.
ఇప్పటికే విశాఖలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే గూగుల్, మెటా, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల డేటా సెంటర్లు ఏర్పాటవుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అమెజాన్ రాకతో నగరం ఐటీ, డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా మరింత బలపడనుంది.
Also Read : అమరావతికే కుచ్చు టోపీ పెడుతున్న బినామీ ఏజెన్సీలు..!
విశాఖలో ఏర్పాటు చేయనున్న అమెజాన్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా సుమారు 900 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నారు. అంతేకాకుండా, ఈ కేంద్రం ద్వారా సంవత్సరానికి సుమారు రూ.10,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు చేయాలనే ప్రతిపాదనను అమెజాన్ సంస్థ ముందుకు తెచ్చింది. ఈ డెవలప్మెంట్ సెంటర్లో అమెజాన్ గ్లోబల్ ఈ-కామర్స్ మార్కెట్ప్లేస్ నిర్వహణతో పాటు, కొత్త డిజిటల్ సేవలు, టెక్నాలజీ సొల్యూషన్ల అభివృద్ధికి సంబంధించిన పనులు జరుగనున్నాయి.
అమెజాన్ కార్యకలాపాల్లో అత్యంత కీలకమైన విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS). క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న AWS, ప్రపంచవ్యాప్తంగా భారీ డేటా సెంటర్ల నెట్వర్క్ను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో, విశాఖలో AWS డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : టీడీపీ మంత్రుల్లో లోకల్ లీడర్ల టెన్షన్..?
విశాఖ తీరంలో ల్యాండ్ అవుతున్న అండర్సీ కేబుల్స్ కారణంగా, ఇక్కడి నుంచి డేటాను అత్యల్ప లేటెన్సీతో ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యమవుతోంది. ఈ భౌగోళిక ప్రయోజనమే గూగుల్, మెటా వంటి సంస్థలను విశాఖ వైపు ఆకర్షించింది. ఇదే క్రమంలో AWS కూడా ఈ జాబితాలో చేరే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా, విశాఖపట్నం ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతూ దేశంలోని కీలక టెక్నాలజీ హబ్లలో ఒకటిగా అవతరిస్తోంది.

